
అదీ కదా విశ్వాసమంటే..!
ఇంటర్నెట్డెస్క్: ‘ఆస్తి కోసం సొంత అన్ననే చంపిన తమ్ముడు’.. ‘భారమయ్యాడని తండ్రిని హతమార్చిన తనయుడు’ ఇలాంటి వార్తలు ఎన్నో వింటాం. మనుషులకు స్వార్థం ఉంటుందేమోగానీ, మూగజీవాలను అది ఏమాత్రం వర్తించదని మరోసారి రుజువైంది. మూగజీవాల్లోనూ శునకానికి ప్రత్యేకత ఉంది. అది విశ్వాసానికి మారుపేరు. దానిని ఒక్కసారి చేరదీస్తే చాలు.. జీవితాంతం గుర్తుంచుకుంటుంది. అలాంటిది తన యజమానురాలే మరణిస్తే..!
వివరాల్లోకి వెళ్తే.. సూరత్లోని వేసు ప్రాంతంలో ఓ జైన సాధ్వి (100) కన్నుమూశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమెను స్థానికులు యాత్రగా తీసుకెళ్తున్నారు. ఇంతలో ఆమె పెంచుకున్న శునకం వచ్చి ఆ పాడె కింద నడవడం మొదలు పెట్టింది. వారంతా అదిల్చే ప్రయత్నం చేశారు. కానీ, అది వెనక్కిపోలేదు. దాదాపు 5 కిలోమీటర్లు వారితోపాటే నడిచి యజమానురాలిపై తనకున్న విశ్వాసాన్ని చాటుకుంది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శ్మశానంలో ఉంది. ఆ శునకం విశ్వాసానికి మెచ్చిన కొందరు తిరుగు ప్రయాణంలో కారులో ఎక్కించుకొని తిరిగి వేసు ప్రాంతంలో విడిచిపెట్టారట. ‘కుక్క విశ్వాసం గల జంతువు’ అని మరోసారి నిరూపితమైంది కదా!