pla: చైనీయులు తట్టుకోలేకపోతున్నారు..!

లద్దాక్‌ ప్రాంతంలో దళాలను మోహరించిన తరచూ వారిని అక్కడి నుంచి మార్చేస్తోంది. 50వేల మందిని తరలించిన ఏడాది లోపే దాదాపు

Updated : 06 Jun 2021 23:43 IST

 90శాతం దళాలను మార్చిన డ్రాగన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

లద్దాక్‌ ప్రాంతంలో దళాలను మోహరించిన తరచూ వారిని అక్కడి నుంచి మార్చేస్తోంది. 50వేల మందిని తరలించిన ఏడాది లోపే దాదాపు 90శాతం మందిని మార్చేసినట్లు సమాచారం . ఇక్కడి అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితుల దెబ్బకు చైనా సేనలు కుదురుకోలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ విధులకు వచ్చిన సైనికులు కనీసం ఏడాది పాటు కూడా ఉండలేకపోతున్నారు. దీంతో వారిని పంపించి రిజర్వు దళాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తోంది. 

గతేడాది శీతాకాలం వారికి నిజంగా నరకం కనిపించింది. చాలా మంది ఈ వాతావరణం తట్టుకోలేక గాయపడటమో, అస్వస్థతకు గురికావడమో జరిగింది.  వాస్తవానికి భారత్‌ కూడా అక్కడ దళాలను మారుస్తుంది. కానీ, చైనాలా 90శాతం కాదు.. దాదాపు 40శాతం వరకు మారుస్తుంది. ఈ ప్రాంతంలో విధుల్లోకి వచ్చిన సైనికులు కనీసం రెండేళ్లపాటు కొనసాగుతాడు. భారత సైనికులకు పర్వత యుద్ధతంత్రంలో మంచి శిక్షణ లభిస్తుంది. దీంతో వారు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతారు. 

ఆరోగ్యంపై పెను ప్రభావం..

అతి శీతల పరిస్థితుల్లో పనిచేయడం సైనికులకు పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో గాయాలు కాకూడదు. పొరబాటున లోహాలను చేతులతో పట్టుకుంటే గాయపడక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అక్యూట్‌ మౌంటేన్‌ సిక్‌నెస్‌, హైఆల్టిట్యూడ్‌ పల్మనరీ ఎడీమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు వారాల కొద్దీ బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో మానసిక సమస్యలు కూడా తెలెత్తుతాయి.

ప్రతి 300 మీటర్ల ఎత్తుకు ఒక రాత్రి బస తప్పుదు..!

చైనా సైనికులు ఆక్సిజన్‌ అందించే ప్రత్యేక గదుల్లో ఉన్నట్లు కొన్నాళ్ల కిందట గ్లోబల్‌ టైమ్స్‌ ఘనంగా చెప్పుకొంది. వాస్తవానికి ఇది గొప్పగా చెపుకోవాల్సిన అంశం కాదు. చైనా తమ సైనికులను ఫారమ్‌ కోళ్ల వలే చూసుకుంటోంది. వారిని చలి వాతావరణానికి అలవాటు పడనివ్వడంలేదు.  2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి వాటిల్లో ఆక్సిజన్‌ 30శాతం వరకు పడిపోతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన ప్రాణవాయువు అందదు. వేగంగా ఎత్తయిన  ప్రదేశాలకు వెళ్లేకొద్దీ శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనిని తట్టుకోవడానికి హపోబ్యాగ్‌ను వాడుతుంటారు. అక్కడి వాతావారణానికి అలవాటు పడటం ఒక్కటే మార్గం. 3వేల మీటర్లు దాటాక కొన్నాళ్లు అక్కడ ఉండి వాతావరణానికి అలావాటు పడాలి. ఇక 4వేల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

 చైనా సైన్యంలో చాలా మంది కాలేజీ విద్యార్థుల వయస్సు వారు ఉండటం.. ఈ వాతవరణానికి తగిన శిక్షణ లేకపోవడం.. అలవాటు పడే లోపే వారిని మార్చేయడం.. ఇలాంటి కారణాలతో కుదురుకోలేకపోతున్నారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఉంది. తమ సైనికులు పూర్తిగా ఆ వాతావరణానికి అలవాటు పడేలా శిక్షణ ఇచ్చింది. 

కొనసాగుతున్న చైనా వార్షిక శిక్షణ..

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వార్షిక శిక్షణలో భాగాంగా ఈ ఏడాది కూడా చైనా సైనికులు తూర్పు లద్దాక్‌లోని భారత సరిహద్దుల సమీపానికి తరలి వచ్చారు.  వీరు వివిధ ప్రాంతాల్లో యుద్ధవిన్యాసాలు చేస్తున్నారు. దీంతో భారత దళాలు అప్రమత్తమయ్యాయి. వారి కదలికలపై ఒక కన్నేసిపెట్టాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు