Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కారణమిదే..!

Emergency Alert Message: మీ ఫోన్‌కు ఏమైనా అత్యవసర సందేశంతో కూడిన ఫ్లాష్‌ మెసేజ్‌ వచ్చిందా? అయితే దాని గురించి మీరేం టెన్షన్‌ పడకండి. కేంద్రమే ఆ సందేశాన్ని పంపింది. ఎందుకు అనుకుంటున్నారా?

Updated : 21 Sep 2023 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్‌ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్‌ (Emergency Alert)’ సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్‌ మెసేజ్‌ (Flash Message) ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు..! దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపింది. అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్‌ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రాగా.. తాజాగా మరోసారి ఈ సందేశం వచ్చింది.

భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థ (Emergency Alert System)ను రూపొందించింది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని పరీక్షించగా.. గురువారం ఉదయం 11.41 గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ వచ్చింది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ఈ అలర్ట్‌ను పంపించారు. మెసేజ్‌తో పాటు ఆ సందేశం ఆడియో రూపంలోనూ వినబడింది. దీంతో యూజర్లు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

రైలు ప్రమాదాల్లో పరిహారం పదిరెట్లు పెంపు

‘Emergency alert: Severe’ పేరుతో వచ్చిన ఈ సందేశంలో.. ‘‘టెలికమ్యూనికేషన్‌ విభాగానికి (Department of Telecommunication) చెందిన సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పంపించిన నమూనా టెస్టింగ్‌ మెసేజ్‌ ఇది. దీన్ని పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్‌-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించాం. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది’’ అని రాసి ఉంది.

ఈ మెసేజ్‌ కింద ఉన్న OK ఆప్షన్‌ను క్లిక్‌ చేయగానే.. మరో మెసేజ్‌ కన్పించింది. అందులో.. ‘మీకు వైర్‌లెస్‌ ఎమర్జెన్సీ మెసేజ్‌ వచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎమర్జెన్సీ మెసేజ్‌లను పొందేందుకు మీ ఆప్షన్‌ను ఎంచుకోండి’ అని రాసి ఉంది. ఇక మన ఫోన్‌ సెట్టింగ్స్‌లోనూ వైర్‌లెస్‌ ఎమర్జెన్సీ అలర్ట్స్‌ అనే ఆప్షన్‌ చేరింది. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ను కొంతమంది యూజర్లు నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు.

మొబైల్‌ ఆపరేటర్లు, సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవస్థల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేపడుతున్నట్లు టెలికమ్యూనికేషన్‌ శాఖ గతంలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దశల వారీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. గతంలో జులై 20వ తేదీ, ఆగస్టు 17వ తేదీల్లోనూ కొంతమంది యూజర్లకు ఈ మెసేజ్‌ వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని