Delhi HC: ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.. ప్రభుత్వ వైఖరేంటి..?

పౌరుల స్థిర, చరాస్తులకు (Property) సంబంధించిన దస్త్రాలను ఆధార్‌తో (Aadhaar) అనుసంధానం చేయాలనుకోవడం మంచి అంశమని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది.

Published : 17 Apr 2023 18:09 IST

దిల్లీ: పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి అంశమని దిల్లీ హైకోర్టు మౌఖికంగా అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ విషయంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది. అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.

అవినీతిని కట్టడి చేయడంతోపాటు బినామీ ఆస్తులను జప్తు చేయడం ప్రభుత్వం బాధ్యత అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘ఉగ్రవాదం, నక్సలిజం, గ్యాంబ్లింగ్‌, మనీలాండరింగ్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెద్ద నోట్లతో బినామీ చెల్లింపులు సాగుతున్నాయి. ఫలితంగా నిత్యవసర వస్తువులతోపాటు ప్రధాన ఆస్తులైనటువంటి రియల్‌ ఎస్టేట్‌, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల వీటన్నింటినీ అరికట్టవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఆధార్‌తో ఆస్తులను అనుసంధానిస్తే.. వార్షిక ఆదాయంలో రెండుశాతం వృద్ధి చెందుతుంది. నల్లధనం, బినామీ చెల్లింపుల ఆధిపత్యంతో కొనసాగుతున్న ఎన్నికలను ఇది ప్రక్షాళన చేస్తుంది’ అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తద్వారా అవినీతి, నల్లధనంపై పోరులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే సందేశం వెళ్తుందన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం.. ఇది మంచి అంశమని, వీటిపై స్పందనలు రానివ్వండి అని మౌఖికంగా అభిప్రాయపడ్డారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మతోపాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనీశ్‌ మోహన్‌లు కూడా ఇది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఈ అంశానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వం 2019లోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. ఆధార్‌ అనేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌, ల్యాండ్‌ మ్యుటేషన్‌లకు గుర్తింపు పత్రంగా మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని.. ఇది తప్పనిసరి అని చెప్పడానికి చట్టంలో ఎటువంటి నిబంధన లేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని