Corona: రాబోయేది పండుగ సీజన్‌.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి సూచనలు

దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లోక్‌సభలో ప్రకటన చేశారు. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు.

Updated : 22 Dec 2022 18:28 IST

దిల్లీ: చైనా, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌(Corona virus) మళ్లీ విజృంభిస్తుండటంతో మన దేశంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి (Union Health minister) మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh mandaviya) లోక్‌సభ(Lok sabha)లో ప్రకటన చేశారు. కొవిడ్‌(Covid)ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో(International Airports) ర్యాండమ్‌ శాంపిల్స్‌ సేకరణ మొదలైందని మంత్రి వెల్లడించారు. కొత్త వేరియంట్లపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. జులై-నవంబర్‌ మధ్య కాలంలో మన దేశంలో బీఎఫ్‌ 7(BF 7) రకానికి చెందిన నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు(Mask) ధరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎప్పటికప్పుడు మారుతోన్న కరోనా వైరస్‌ స్వభావం ప్రపంచ ఆరోగ్య రంగానికి ప్రమాదకరంగా మారుతోందన్నారు. విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ శాంపిల్స్‌ సేకరణ మొదలైనట్టు చెప్పారు. ప్రతి కొవిడ్‌ కేసును జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించామని.. తద్వారా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకలు, రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ల వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కోరారు. కరోనా మహమ్మారి నియంత్రణలో ఆరోగ్యశాఖ చురుగ్గా పనిచేస్తోందన్నారు.  ప్రికాషన్‌ డోసుల కవరేజీ పెంచడంతో పాటు వీటిపై అవగాహన పెంచాలని సూచించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

మాస్కు ధరించి రాజ్యసభకు ప్రధాని మోదీ

కరోనా భయాలు మళ్లీ వెంటాడుతున్న వేళ రద్దీ ప్రాంతాల్లో ప్రజలంతా మాస్కులను తప్పకుండా ధరించాలని నిన్న విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ మాస్కు ధరించారు. అంతేకాకుండా లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌తో పాటు పార్లమెంట్‌ సభ్యులంతా మాస్కులు ధరించి సభకు హాజరయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని