Monkeypox: కేంద్రం అప్రమత్తం.. ‘మంకీపాక్స్‌’ కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

దేశంలో మంకీపాక్స్‌ కేసుల పర్యవేక్షణ, కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు...

Published : 02 Aug 2022 01:48 IST

దిల్లీ: దేశంలో మంకీపాక్స్‌(Monkeypox) కేసుల పర్యవేక్షణ, కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌(Special Task Force)ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్(NITI Aayog) సభ్యుడు వీకే పాల్ (VK Paul) ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆరోగ్యశాఖ అధికారులతోపాటు దేశంలోని ప్రధాన వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులూ సభ్యులుగా ఉంటారని తెలిపాయి. వైరస్‌ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేస్తుంది. ఇటీవల నిర్వహించిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రీకృత టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

‘దేశంలో మంకీపాక్స్ కేసుల నిర్వహణలో ఈ టాస్క్‌ఫోర్స్‌ సహాయపడుతుంది. ఆయా రాష్ట్రాల్లో నమోదయ్యే కేసులను సమన్వయం చేస్తుంది. అవసరమైతే సూచనలు జారీ చేస్తుంది’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు కేరళలో కాగా.. మరొకటి దిల్లీలో వెలుగుచూసింది. ఈ క్రమంలోనే కేరళలో మంకీపాక్స్‌ లక్షణాలతో ఓ 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అతని నమూనాలను పరీక్షలకు పంపగా.. మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి సోమవారం వెల్లడించారు. అయితే, భారత్‌కు వచ్చేముందే యూఏఈలో అతనికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలగా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుల వద్ద దాచిపెట్టినట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని