
Elephants: 15 ఏనుగులు.. 500 కిలోమీటర్లు
పంట పొలాలు, ఇళ్లను ధ్వంసం చేస్తూ సంచారం
బీజింగ్: చైనాలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపును నిలువరించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. యువాన్ ఫ్రావిన్స్లోని నేచర్ రిజర్వ్ నుంచి 500 కిలోమీటర్లు నడిచిన 15 అడవి ఏనుగుల గుంపును అధికారులు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 70 లక్షల జనాభా గల కున్మింగ్ నగరానికి అవి చేరువ కావడంతో వాటిని జనావాసాల నుంచి దూరంగా ఉంచడానికి యత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పంటలను నాశనం చేస్తున్న గజరాజుల గుంపు నగరాల్లోని రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
గతేడాది యువాన్ ఫ్రావిన్స్లోని నేచర్ రిజర్వ్ నుంచి బయటకువచ్చిన 16 అడవి ఏనుగులు ఏకంగా 500 కిలోమీటర్ల దూరం పయనించాయి. మొత్తంగా 16 గజరాజులు నేచర్ రిజర్వ్ నుంచి బయటకు రాగా.. వాటిలో రెండు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. మధ్యలో ఓ పిల్ల ఏనుగు పుట్టడంతో ప్రస్తుతం 15 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అవి తమ దారిలో అడ్డుపడిన ఎన్నో పంట పొలాలు, ఇళ్లను ధ్వంసం చేశాయి. అనేక పట్టణాల గుండా ప్రయాణం చేసి ప్రస్తుతం 70 లక్షల జనాభా గల కున్మింగ్ నగరానికి చేరువయ్యాయి. 360 మందితో కూడిన టాస్క్ఫోర్స్ ఏనుగులను నిత్యం గమనిస్తోంది. 76 కార్లు, 9 డ్రోన్ల సాయంతో వీరు ఏనుగుల గుంపు కదలికలపై నిరంతరం నిఘా పెట్టారు. గజరాజులు రోడ్లపైకి చేరుకున్నప్పుడు ట్రాఫిక్ను నిలువరించడం, అడ్డంకులు ఏర్పాటు చేయడం, ఆహారాన్ని ఎరగా చూపడం వంటి పనులు చేస్తున్నారు.
ఏనుగులు 500 కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం చైనాలో ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు వెల్లడించారు. గుంపునకు నేతృత్వం వహిస్తున్న ఏనుగుకు తగిన అనుభవం లేకపోవడం వల్ల ఇలా అడవులు విడిచి వచ్చినట్లు భావిస్తున్నారు. గతవారం ఇషాన్ నగరంలో ఏనుగులు వీధుల్లోకి వచ్చిన సమయంలో 6 గంటలపాటు పట్టణవాసులను ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏనుగుల కారణంగా 11 లక్షల డాలర్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.