The Kashmir Files: ‘హిట్లర్‌ గొప్పవాడు’.. ఇజ్రాయెల్‌ రాయబారికి విద్వేష సందేశాలు!

‘ది కశ్మీర్‌ ఫైల్స్’ చిత్రంపై ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ సైతం ఖండించారు. ఈ క్రమంలోనే తనకు ట్విటర్‌ వేదికగా ద్వేషపూరిత సందేశాలు వస్తున్నాయని గిలాన్‌ శనివారం తెలిపారు.

Published : 04 Dec 2022 01:04 IST

దిల్లీ: ఇటీవల ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌ (The Kashmir Files)’ చిత్రంపై ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రంగా పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తమైంది. లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌(Naor Gilon)  ఖండించారు. భారత ప్రభుత్వానికి ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే తనకు ట్విటర్‌ వేదికగా విద్వేషపూరిత సందేశాలు వస్తున్నాయని గిలాన్‌ శనివారం తెలిపారు. ఈ మేరకు ఓ వ్యక్తి పంపిన మెసేజ్‌ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

‘మీలాంటి వ్యక్తులను అంతం చేసిన హిట్లర్ గొప్పవాడు. వెంటనే భారత్‌నుంచి వెళ్లిపోండి. హిట్లర్ గొప్ప వ్యక్తి’ అని అందులో రాసి ఉంది. పీహెచ్‌డీ చేసిన ఓ వ్యక్తి ఈ మెసేజ్‌ను పంపినట్లు తెలుస్తోందని చెబుతూ.. అతని వివరాలు గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలోనే పలువురు గిలాన్‌కు మద్దతుగా నిలిచారు. అనంతరం ఆయన మరో ట్వీట్‌ చేస్తూ.. ‘ఇంకా కొందరిలో జాతివివక్ష భావాలు ఉన్నాయని ఈ పోస్ట్‌ ద్వారా గుర్తుచేయాలనుకున్నా. మనమంతా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించాలి’ అని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నియంత హిట్లర్‌ నేతృత్వంలోని నాజీలు.. లక్షలాది యూదులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్‌- భారత్‌ సంబంధాలు పటిష్ఠమైనవని పలువురు నెటిజన్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై తాను చేసిన వ్యాఖ్యలతో బాధపడిన వారికి లాపిడ్‌ సైతం ఇటీవల క్షమాపణలు చెప్పారు. తానెప్పుడూ ఎవరినీ అవమానించాలనుకోనని, అది తన ఉద్దేశం కాదని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని