Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!

19 ఏళ్ల పాటు మోదీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని, శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్లుగా ఆయన ఈ వేదనను అనుభవించారని హోమంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 26 Jun 2022 01:53 IST

2002 గుజరాత్‌ అల్లర్ల కేసుపై స్పందించిన అమిత్‌ షా

దిల్లీ: 19 ఏళ్ల పాటు మోదీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని.. శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్లుగా ఆయన ఈ వేదనను అనుభవించారని కేంద్ర హోం  శాఖ మంత్రి  అమిత్‌ షా అన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను నిన్న సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శనివారం అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లపాటు ఒక్క మాట మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్లుగా ఆ బాధను భరించారు. ఆ వేదనను నేను ఎంతో దగ్గరగా చూశాను. ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం’ అంటూ మోదీ తీరును అభినందించారు. 

‘గుజరాత్‌ అల్లర్లపై కొందరు విషప్రచారం చేశారు. కావాలనే నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. కానీ ఆ ఆరోపణల నుంచి మోదీ బయటపడ్డారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం శుభపరిణామం. సిట్‌ విచారణను మేం ప్రభావితం చేయలేదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగింది. ఈ కేసు భాజపా ప్రతిష్ఠను దెబ్బతీసింది. కానీ ఇప్పుడదంతా తొలగిపోయింది’ అని వెల్లడించారు.

అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈడీ విచారణకు హాజరవుతోన్న తీరును తీవ్రంగా నిరసించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరవుతోన్న ఆయనకు మద్దతుగా కేంద్రంపై కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలుపుతున్నారు. ‘సిట్ ముందు హాజరయ్యేప్పుడు మోదీ ఎలాంటి హడావుడి చేయలేదు. విచారణను నిరసిస్తూ ధర్నా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు ఇవ్వలేదు. ఆనాడు సీఎం స్థాయిలో ఉన్నా విచారణకు సహకరించారు. ఆ అల్లర్ల సమయంలో అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. కానీ దిల్లీలో చాలామంది సిక్కులను చంపివేశారు. కానీ ఒక్క అరెస్టు చేయలేదు. మేము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని వారు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు. నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఆ ఆరోపణలన్నీ రాజకీయపూరితమైనవని కోర్టు కూడా చెప్పింది’ అని తెలిపారు. 

ఇదీ జరిగింది..

2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఇషాన్‌ జఫ్రీ భార్య జకియా జఫ్రీ పలు కోర్టులను ఆశ్రయించారు.

మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు సైతం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని