Nagaland Firing:  తీవ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం!

నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో వివరణ ఇచ్చారు. తీవ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు.

Updated : 06 Dec 2021 19:42 IST

నాగాలాండ్‌ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి వివరణ

దిల్లీ: నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో వివరణ ఇచ్చారు. తీవ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. సైన్యం పొరబాటుకు కేంద్రం పశ్చాత్తాప పడుతోందన్న ఆయన.. ఘటనపై సిట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

‘‘ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో తీవ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. దీంతో డిసెంబరు 4న ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్‌ మెరుపు దాడి చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి. అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అందులో ఉన్నది తీవ్రవాదులని అనుమానించిన దళాలు.. ఆ వాహనంపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఆరుగురు మరణించారు. అయితే ఆ తర్వాత పొరబాటు జరిగిందని గుర్తించిన బలగాలు.. వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. అయితే కాల్పుల విషయం తెలియగానే స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత డిసెంబరు 5 సాయంత్రం కూడా స్థానికులు ఆర్మీ ఆపరేటింగ్‌ బేస్‌పై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అస్సాం రైఫిల్స్‌ కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.’’ అని అమిత్‌ షా చెప్పారు. 

ఘటన గురించి తెలియగానే నాగాలాండ్‌ ఉన్నతాధికారులతో తాను స్వయంగా మాట్లాడానని షా అన్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అయితే సామాన్య పౌరులు మృతి చెందడం దురదృష్టకరమని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో చింతిస్తోందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు. ఘటనపై ఆర్మీ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. దీంతో పాటు సిట్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నెల రోజుల్లోగా నివేదిక ఇస్తుందని, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భద్రతా బలగాలను హెచ్చరించినట్లు అమిత్ షా తెలిపారు.

ప్రతిపక్షాల ఆందోళనలు..

నాగాలాండ్‌ ఘటనపై చర్చ జరపకుండా.. కేంద్రమంత్రి అమిత్ షా కేవలం వివరణ మాత్రమే ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీనిపై సవివర చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ సభలో ఆందోళనకు దిగాయి. అయితే స్పీకర్‌ అందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని