Corona: అక్టోబర్‌లో గరిష్ఠానికి మూడో ముప్పు..!

కరోనా థర్డ్‌వేవ్‌ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు.. పెద్దల వలే పిల్లలు ప్రభావితం కావొచ్చు.. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు.

Updated : 23 Aug 2021 12:09 IST

ప్రధానమంత్రి కార్యాలయానికి నిపుణుల బృందం నివేదిక

దిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు.. పెద్దల వలే పిల్లలు ప్రభావితం కావొచ్చు.. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు. నిపుణుల బృందం ఈ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. ‘థర్డ్‌వేవ్‌ ప్రిపేర్డ్‌నెస్: చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ’ శీర్షికన వెలువడిన ఈ నివేదిక అందుబాటులో ఉన్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

‘ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తితే..  వైద్యసిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్యసేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవు. అలాగే చికిత్స సమయంలో వైరస్‌ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కొవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలి’ అని నిపుణుల బృందం ప్రతిపాదించింది. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతోన్న చిన్నారులకు టీకా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది. ఇటీవల కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. కేంద్రం థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, చిన్నపిల్లల వైద్యసేవల వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకోపక్క చిన్నారులకు టీకా అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. మూడు రోజుల క్రితం అత్యవసర ఆమోదం పొందిన జైడస్ క్యాడిలా.. దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.   

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మనదేశంలో కరోనా సెకండ్ వేవ్‌ ఏ స్థాయిలో కల్లోలం సృష్టించిందో తెలిసిందే. వైద్య సేవల కొరత, మార్చురీలు, శ్మశానాలు నిండిపోవడం, అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి చూడటం ప్రతి ఒక్కరిని కలచివేసింది. అది తగ్గుముఖం పడుతున్న సమయంలో థర్డ్‌వేవ్‌ ఆందోళన మొదలైంది. దాంతో ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాల కల్పనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి 100 వైరస్ పాజిటివ్‌ కేసుల్లో 23 మందికి ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా సన్నాహాలు చేయాలని నీతి ఆయోగ్‌ ప్రభుత్వానికి సూచించింది. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని