Jammu And Kashmir: అమిత్ షా పర్యటనకు ముందు.. జమ్ముకశ్మీర్‌లో వరుస పేలుళ్లు

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ను రెండు భారీ పేలుళ్లు వణికించాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.  మొత్తం రెండు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు.

Updated : 29 Sep 2022 11:27 IST

గంటల వ్యవధిలో రెండు బస్సుల్లో ఘటనలు

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ను రెండు భారీ పేలుళ్లు వణికించాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.  మొత్తం రెండు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. తొలి పేలుడులో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 10.30 సమయంలో దొమాయిల్‌ చౌక్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ సమీపంలో నిలిపిన బస్సులో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో కండక్టర్‌ సునీల్‌సింగ్‌, మరో వ్యక్తి గాయపడ్డారు. పేలుడు జరిగే సమయంలో వీరు బస్సులోని డ్రైవర్‌ క్యాబిన్‌లో కూర్చొని ఉన్నారు. ఈ బస్సు నిత్యం ఉధంపూర్‌-రామ్‌ఘర్‌-బసంత్‌ఘర్‌కు ప్రయాణికులను చేరవేస్తుంది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రామ్‌ఘర్‌కు పంపేందుకు కొన్ని దుప్పట్లను బస్సుపై లోడు చేశారని బాధితులు తెలిపారు. ఆ తర్వాతే ఈ పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్‌లో మరో బస్సులో పేలుడు సంభవించడం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉధంపూర్‌ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాదాపు ఆరు నెలల క్రితం కూడా ఉధంపూర్‌లో బాంబు పేలుడు జరిగింది. స్థానిక సల్తియా చౌక్‌ వద్ద మాగ్నెటిక్‌ బాంబ్‌ పేలి ఒకరు మరణించగా 17 మంది గాయపడ్డారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరో మూడు రోజుల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుండగా ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఆయన త్రికూట్‌ హల్స్‌లోని మాతా వైష్ణోదేవీని దర్శించుకోనున్నారు. అదే సమయంలో రాజౌరీ, బారాముల్లాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని