‘కొత్త’ ఆనందం.. పక్షులకు శాపం 

కరోనాతో గడిచిన 2020 చేదు జ్ఞాపకాలకు గుడ్‌బై చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించింది యావత్‌ ప్రపంచం. అయితే కొవిడ్‌ భయం.. ప్రభుత్వాల ఆంక్షల నడుమ ఈసారి ‘కొత్త’ వేడుకలు నిరాడంబరంగానే

Published : 02 Jan 2021 11:43 IST

రోమ్‌: కరోనాతో గడిచిన 2020 చేదు జ్ఞాపకాలకు గుడ్‌బై చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించింది యావత్‌ ప్రపంచం. అయితే కొవిడ్‌ భయం.. ప్రభుత్వాల ఆంక్షల నడుమ ఈసారి ‘కొత్త’ వేడుకలు నిరాడంబరంగానే జరిగినప్పటికీ కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు బాణసంచా మెరుపులతో వెలుగులీనాయి. అయితే ఇటలీ రాజధాని రోమ్‌లో ఈ మెరుపులు.. మూగజీవాలకు శాపంగా మారాయి. బాణసంచా శబ్దాలు, వాటి నుంచి వెలువడిన నిప్పురవ్వలతో రోమ్‌ వీధుల్లో వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి.

బాణసంచా నుంచి వెలువడిన భారీ శబ్దాలు, మెరుపులు చూసి గూళ్లలో ఉన్న పక్షులు భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా ఎగిరాయి. అయితే వందలాది పక్షులు ఒకేసారి ఆకాశంలోకి ఎగరడంతో వాటిల్లో అవి ఢీకొనడం, లేదా ఇళ్ల కిటికీలు, విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టి మరణించాయని అంతర్జాతీయ మూగజీవాల రక్షణ సంస్థ ప్రతినిధి లోరెడానా డిగ్లియో తెలిపారు. కొన్ని పక్షుల్లో భయంతో గుండెపోటు కూడా వచ్చి ఉండొచ్చని అన్నారు.

వేడుకల అనంతరం రోమ్‌ రహదారులపై అనేక పక్షులు చలనం లేకుండా పడిపోయి ఉన్న దృశ్యాలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు జంతు ప్రేమికులను కంటతడి పెట్టిస్తున్నాయి. రోమ్‌లో వ్యక్తిగత బాణసంచా వినియోగంపై నిషేధం ఉంది. దీంతో పాటు కొవిడ్‌ కారణంగా న్యూ ఇయర్‌ వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి నగరంలో కర్ఫ్యూ పెట్టారు. అయినప్పటికీ కొందరు వీటిని విస్మరించి బాణసంచా కాల్చారు.

ఇవీ చదవండి..

జనవరి 1, 2021.. 60వేల జననాలు!

కాలిఫోర్నియాలో మరణ మృదంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని