Presidential Election: రాష్ట్రపతి రేసులో లేను: నీతీశ్‌

రాష్ట్రపతి ఎన్నికల బరిలో తాను లేనని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌......

Published : 13 Jun 2022 22:10 IST

పట్నా: రాష్ట్రపతి ఎన్నికల బరిలో తాను లేనని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో జులైలో జరగబోయే ఎన్నికల బరిలో నీతీశ్‌ ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టారు. పట్నాలో ప్రతివారం ప్రజలతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా నీతీశ్‌ మాట్లాడుతూ.. ‘దేశ తదుపరి రాష్ట్రపతి రేసులో నేను లేను. నేనెక్కడికీ వెళ్లడంలేదు. అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి. ఊహాగానాలు మాత్రమే’ అని తేల్చి చెప్పారు. ఈ నెల 9న రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే.. బిహార్‌ గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను నీతీశ్‌ కొట్టిపారేశారు. రాష్ట్రపతి కావడానికి కావాల్సిన అన్ని సామర్థ్యాలూ నీతీశ్‌కు ఉన్నాయని.. ఓ బిహారీగా నీతీశ్‌ దేశ ప్రథమ పౌరుడు కావాలని తాను కోరుకుంటున్నానని.. ఆయన రేసులో లేనప్పటికీ ప్రతి వ్యక్తీ నీతీశ్‌ రాష్ట్రపతి కావాలనుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై నీతీశ్‌ను ప్రశ్నించగా ‘‘మళ్లీ చెబుతున్నా.. నేను రాష్ట్రపతి రేసులో లేను’’ అని సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని