రఫేల్‌ రాకతో..చైనా క్యాంపులో ఆందోళన!

రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో చైనా ఆందోళనకు గురికావడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి స్పష్టంచేశారు.

Published : 04 Feb 2021 15:14 IST

భారత వైమానిక దళాధిపతి

బెంగళూరు: చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, వీటి రాకతో చైనా ఆందోళనకు గురికావడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి స్పష్టంచేశారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్‌‌ పేర్కొన్నారు.

‘ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల సైనికాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు ఫలప్రదమౌతాయనే అశిస్తున్నాం. కానీ, ఒకవేళ కొత్త పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అవసరమైనన్ని బలగాలను రంగంలోకి దించాం’ అని భారత వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాలను తగ్గించుకున్నప్పటికీ, ఇతర చర్యల ద్వారా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా J-20 యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. వాటికి అనుగుణంగానే భారత్‌ కూడా వ్యూహాలు మారుస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా రఫేల్‌ రాక చైనాలో ఆందోళనకు కారణమయ్యిందా? అనే ప్రశ్నకు భారత వైమానిక దళాధిపతి కచ్చితంగా అవుననే సమాధానమిచ్చారు.

దాదాపు ఏడాదిగా తూర్పు లద్దాఖ్ సరిహద్దులో చైనా, భారత్‌ బలగాలను ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. వీటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగాయి. ఇదే సమయంలో అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరిపోయాయి. దీంతో ఆందోళన చెందిన చైనా, భారీ స్థాయిలో J-20 యుద్ధ విమానాలను సరిహద్దు ప్రాంతానికి తరలించింది. ఇక నియంత్రణ రేఖ వెంట గస్తీని ముమ్మరం చేయడంలో భాగంగా అక్కడ తేజస్‌ యుద్ధవిమానాలను మోహరించామని ఐఏఎఫ్‌ చీఫ్‌ తెలిపారు. బడ్జెట్‌లో రక్షణ శాఖ నిధులు పెంచడాన్ని గొప్ప నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

ఇదిలాఉంటే, ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ రఫేల్‌ యుద్ధవిమానాల సంఖ్య భారత్‌లో 11కి చేరింది. మొత్తం 36 రఫేల్‌ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దఫాలో ఐదు, తర్వాత మూడు, మరో దఫాలో మూడు చేరుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 11 రఫేల్‌ విమానాలను భారత్‌కు అందించింది.

ఇవీ చదవండి..
వాయుసేనలో ఈ చిన్నోడికి దూకుడెక్కువ..!
ఎంతటి దుస్సాహసాన్నైనా అడ్డుకుంటాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని