కరోనా విపత్తు.. ఆర్థిక సంక్షోభం కంటే 4 రెట్లు అధికం!

ప్రపంచదేశాల్లో విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్‌ ప్రపంచ శ్రామిక శక్తికి విపత్తుగా మారిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) అభివర్ణించింది.

Published : 08 Jun 2021 01:20 IST

అంతర్జాతీయ కార్మిక సంస్థ

జెనీవా: ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ శ్రామిక శక్తికి విపత్తుగా మారిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) అభివర్ణించింది. ఇది వరకు చవిచూసిన ఆర్థిక సంక్షోభం ప్రభావం కంటే కరోనా తీవ్రత వల్ల ఏర్పడ్డ పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ సరఫరాలో అసమానతల కారణంగా కొవిడ్‌ అనంతరం ఆర్థిక పునరుద్ధరణలోనూ ఈ అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎల్‌ఓ హెచ్చరించింది.

‘2008-09లో ప్రపంచం చవిచూసిన ఆర్థిక సంక్షోభ ప్రభావం కంటే శ్రమశక్తిపై కరోనా వైరస్‌ చూపిస్తున్న ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రభావం ఎంతో వినాశకరమైనది’ అని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌ పేర్కొన్నారు. వైరస్‌ ప్రభావం నుంచి బయటపడుతున్న కొన్ని దేశాల్లో వేగంగా ఉద్యోగ కల్పనతో పాటు ఆర్థికంగా కోలుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా కోలుకుంటున్న తరుణంలో ఏర్పడే అసమానతలపైనా అప్రమత్తంగా ఉండాలని గై రైడర్‌ అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం ప్రజారోగ్యాన్నే కాకుండా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులనూ తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక వెల్లడించింది. 2022లో 20.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం అదనంగా 10.8 కోట్ల మంది కార్మికులను ‘పేదలు లేదా నిరుపేదలు’గా మహమ్మారి మార్చిందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని