Rahul Gandhi: దేశం కోసమే నా పోరాటం.. ఎంత మూల్యానికైనా సిద్ధమే..!

తనపై అనర్హత వేటు (Disqualified) పడటంపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందిస్తూ.. భారత్‌ కోసమే తన పోరాటమని, ఈ క్రమంలో ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని అన్నారు.

Published : 24 Mar 2023 19:47 IST

దిల్లీ: పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ఆయన.. ‘భారత్‌ గళాన్ని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని.. ఈ క్రమంలో ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమే’ అని ట్వీట్‌ చేశారు.

రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) దోషిగా నిర్ధారిస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయనపై అనర్హత వేటు విధిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ శుక్రవారం ప్రకటించింది. తీర్పు వెలువడిన మార్చి 23 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతకుముందు, అనర్హత వేటుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో శుక్రవారం ఉదయం రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ (Parliament)కు హాజరయ్యారు. తొలుత పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం కాగానే అందులో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక భేటీ..

రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని రచించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, జనరల్‌ సెక్రటరీలు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, రాజీవ్‌ శుక్లా, తారీఖ్‌ అన్వర్‌లతోపాటు సీనియర్‌ నేతలు పి.చిదంబరం, ఆనంద్‌ శర్మ, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్‌, సల్మాన్‌ ఖుర్షిద్‌, పవన్‌ కుమార్‌ బన్సాల్‌, మరికొందరు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. అయితే, ఈ భేటీకి రాహుల్‌ గాంధీ రాలేదని సమాచారం.

మరోవైపు మోదీ ఇంటిపేరును కించపరిచేలా 2019లో కర్ణాటకలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్‌ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్‌ తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని