ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించేందుకు.. అన్ని పార్టీలు ఏకమై..!

అరిహాను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని భారత ఎంపీలు అన్నారు. ఈ మేరకు జర్మనీ(Germany) దౌత్యవేత్తకు లేఖ రాశారు. 

Published : 03 Jun 2023 20:48 IST

దిల్లీ: బెర్లిన్‌(Berlin)లో గత ఇరవై నెలలుగా అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారి అరిహా షా(3)ను వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించేందుకు రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈ మేరకు 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు(MPs) భారత్‌లోని జర్మనీ(Germany) దౌత్యవేత్తకు లేఖ రాశారు.

‘అరిహాను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకా ఆలస్యమైతే ఆ పాపకు కోలుకోలేని హాని జరుగుతుంది. ఆ చిన్నారిని తిరిగి స్వదేశానికి పంపించాలని అత్యవసర అభ్యర్థన చేస్తున్నాం. అరిహా తండ్రి జర్మనీలోని సంస్థలో ఉద్యోగం చేశారు. ఆ కుటుంబం ఇప్పటికే స్వదేశానికి తిరిగిరావాల్సి ఉంది. కానీ ఈ విషాద ఘటన వల్ల వారు అక్కడే ఉంటున్నారు. మేం మీ దేశంలోని సంస్థలను తప్పుపట్టడం లేదు. మీ దగ్గర ఉన్న విధానాలను గౌరవిస్తాం. మనం ఏం చేసినా ఆ చిన్నారి మెరుగైన భవిష్యత్తు కోసమే. ఆ పాప కుటుంబంలో ఏ ఒక్కరి మీద భారత్‌లో కేసులు లేవు. ఇంతకంటే ఆలస్యం చేస్తే పాప భవిష్యత్తుకు మంచిదికాదు. అలాగే ఆరిహా ప్రత్యేక అవసరాలున్న బిడ్డ కాదు. ఆమెను చూసుకునే సంరక్షకులు తరచూ మారడం వల్ల ట్రామాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. తమ బిడ్డను చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులకు రెండువారాలకు ఒకసారి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారు కలుసుకున్నప్పటి వీడియోలు చూస్తుంటే మా మనస్సులు ద్రవిస్తున్నాయి. వారి మధ్య ఉన్న బంధం, విడిపోవడం వల్ల కలిగిన బాధ వాటిలో కనిపిస్తోంది’ అని వారు ఆ లేఖలో అభ్యర్థించారు. 

ముంబయికి చెందిన భవేష్‌ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి అరిహా షా జన్మించింది. పాప ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేటు అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగికదాడి జరిగి ఉండవచ్చన్న కారణం చూపుతూ 2021 సెప్టెంబరు 23న జర్మనీ అధికారులు ఆమె సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. అప్పుడు అరిహా షా ఏడు నెలల చిన్నారి. ఇదిలా ఉంటే.. మరో రెండు నెలల్లో భవేష్‌ షా దంపతుల వీసా గడువు ముగిసిపోనుండటంతో అరిహా కోసం వారు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇదివరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. అరిహా సుదీర్ఘకాలం జర్మన్ల సంరక్షణలో ఉండటం ఆమెకున్న సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన హక్కుల ఉల్లంఘనగా భారత ప్రభుత్వంతోపాటు ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని