Borewell: చిన్నారి కథ విషాదాంతం.. 52 గంటలు శ్రమించినా దక్కని ఫలితం!

మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందింది. 52 గంటల సహాయక చర్యల అనంతరం ఆమెను 100 అడుగుల లోతు నుంచి వెలికితీశారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Published : 08 Jun 2023 19:45 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో బోరుబావి (Borewell)లో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. రెండు రోజులకుపైగా శ్రమించిన అధికారులు చివరకు ఆమెను వెలికితీసినా.. ఆస్పత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం ఆమె బోరుబావిలో పడిపోగా.. నిరంతర సహాయక చర్యలు చేపట్టి గురువారం సాయంత్రానికి బయటకు వెలికితీశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఊపిరాడక అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వెల్లడైంది.

ఇక్కడి సెహోర్‌ జిల్లా ముంగావలీ గ్రామంలో రెండున్నరేళ్ల చిన్నారి.. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకుపోగా.. అనంతరం 40 అడుగుల లోతుకు జారిపోయింది. ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి చేరుకున్న సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఈఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించాయి. గురువారం రోబోటిక్‌ నిపుణులూ రంగంలోకి దిగారు.

ఒకవైపు వర్షం, ఈదురుగాలులు.. మరోవైపు రాతి నేల కావడంతో సహాయక చర్యల ప్రకంపనలకు చిన్నారి మరింత కిందికి జారిపోతుండటం.. సిబ్బందికి సవాల్‌గా మారింది. అప్పటికే చిన్నారికి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 52 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టి.. 100 అడుగుల లోతులో పాపను వెలికితీశారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరకు పాపను కాపాడుకోలేకపోయామని కలెక్టర్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు