సీరియళ్లలో కౌగిలింతలు కట్‌.. ఎక్కడంటే..?

స్థానిక టీవీ సీరియళ్లపై పాక్‌ ప్రభుత్వం కత్తెర వేటు వేయనుంది. ఇకనుంచి తమ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) తాజాగా టీవీ ఛానెళ్లకు ఆదేశాలు...

Published : 24 Oct 2021 01:30 IST

ఇస్లామాబాద్‌: స్థానిక టీవీ సీరియళ్లపై పాక్‌ ప్రభుత్వం కత్తెర వేటు వేయనుంది. ఇకనుంచి తమ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) తాజాగా టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా కంటెంట్‌పై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పైగా, సదరు కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని తెలిపింది.

ముందుగా సమీక్షించాల్సిందే..

సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం తదితరమైనవి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్‌ఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, సంబంధిత దృశ్యాలను కత్తిరించాలని ఆదేశించింది. శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ పీఈఎంఆర్‌ఏ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు తదితర అంశాలను పట్టించుకోని కొంతమంది స్పందనను పీఈఎంఆర్‌ఏ పరిగణనలోకి తీసుకుందని విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని