వ్యాక్సిన్‌ పంపిణీ.. మనమే టాప్‌!

కరోనా నివారణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ దూసుకుపోతోంది. ఈ సాయంత్రానికే ఆరు మిలియన్ల మార్కును దాటేసింది....

Published : 08 Feb 2021 23:11 IST

అమెరికా కన్నా మనమే ముందున్నాం..!

దిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకా కార్యక్రమంలో భారత్‌ దూసుకుపోతోంది. సోమవారం సాయంత్రానికే ఆరు మిలియన్ల మార్కును దాటేసింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. దేశంలో సోమవారం సాయంత్రం నాటికి 60లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. 60 లక్షల టీకాల పంపిణీకి భారత్‌లో 24 రోజుల సమయం పట్టగా.. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. సోమవారం ఒక్కరోజే (సాయంత్రం 6గంటల వరకు) 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2,23,298 మందికి టీకాలు పంపిణీ చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను జనవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా పంపిణీ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటిదాకా టీకా అందుకున్నవారిలో 54,12,270 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండగా.. 6,23,390మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఉన్నారు. టీకా వేసుకున్నవారిలో ఇప్పటిదాకా 29మంది ఆస్పత్రి పాలైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం వ్యాక్సినేషన్‌లో ఇది 0.0005శాతమని తెలిపింది. ఆస్పత్రిపాలైనవారిలో 9మంది మరణించగా.. 19 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. కేరళలో ఓ వ్యక్తి వేరే ఆరోగ్య కారణాలతో ఆస్పత్రిపాలయ్యారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. గడిచిన 24గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో 29 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ కారణంగా ఈ మరణాలు సంభవించలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటిదాకా ఏపీలో 3,08,718 మంది, తెలంగాణలో 2,09,104 మంది టీకాలు వేయించుకున్నారు.

ఇదీ చదవండి..

గుడ్‌న్యూస్‌: 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని