Corona Vaccine: వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ రికార్డ్‌.. 200కోట్ల డోసుల పంపిణీ పూర్తి

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా డోసుల పంపిణీని భారత్‌ పూర్తి చేసింది.

Published : 17 Jul 2022 15:52 IST

దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో (Vaccination) భారత్‌ సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా డోసుల పంపిణీని భారత్‌ పూర్తి చేసింది. దేశంలో జనవరి 16, 2021న వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం.. 18 నెలల్లోనే 200కోట్ల డోసుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు దేశవ్యాప్తంగా 2,00,00,15,631 డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) వెల్లడించింది. ఈ ఘనతపై స్పందించిన ప్రధాని మోదీ.. భారత్‌ మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ ఇదెంతో గర్వకారణమన్న ఆయన.. కరోనా మహమ్మారిపై యావత్‌ ప్రపంచం చేస్తోన్న పోరుకి భారత్‌ సాధించిన ఘనత మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.

* దేశవ్యాప్తంగా గతేడాది ప్రారంభమైన వ్యాక్సిన్‌ పంపిణీ భారీస్థాయిలో శరవేగంగా కొనసాగుతోంది.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు అర్హులైన వారిలో 98శాతం మంది కనీసం ఒకడోసు తీసుకున్నారు

90శాతం అర్హులకు పూర్తిమోతాదులో (రెండు డోసులు) డోసులు అందాయి.

దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 51.5శాతం పురుషులు కాగా 48.9శాత మంది మహిళలు

వందకోట్ల మైలురాయిని దాటడానికి 9నెలలు (277 రోజులు) పట్టింది. మరో 9 నెలల్లో 200 కోట్ల మార్కును చేరుకుంది

గతేడాది సెప్టెంబర్‌ 17న ఒకేరోజు 2.5కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ రికార్డు సృష్టించింది.

దేశంలో మూడో డోసు (Booster Dose) పంపిణీ జులై 15, 2022న ప్రారంభమైంది. ఇప్పటివరకు 5కోట్ల 63లక్షల డోసులు పంపిణీ చేశారు

ప్రికాషనరీ డోసు (Precaution Dose) పేరుతో ఇస్తోన్న బూస్టర్‌ డోసును తొలుత ప్రైవేటులో అందుబాటులో ఉంచగా.. తాజాగా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది

రెండు, మూడో డోసు మధ్య వ్యవధి తొలుత తొమ్మిది నెలలుగా ఉండగా.. ప్రస్తుతం దాన్ని 6నెలలకు తగ్గించారు

మొత్తంగా చూస్తే ప్రపంచంలో 184 దేశాల్లో ఇప్పటివరకు 1225కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వ్యాక్సిన్‌ పంపిణీలో చైనా, భారత్‌లు ముందుండగా.. ఈయూ, అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని