పెట్రోల్‌లో 20% ఇథనాల్‌.. టార్గెట్‌ 2025

World Environment Day: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిక్సింగ్‌కు 2025ను టార్గెట్‌గా నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 05 Jun 2021 18:01 IST

దిల్లీ: కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని పరిమితం చేయాలన్న ఉద్దేశంతో పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపి వినియోగించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2025 నాటికి 20శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇథనాల్‌ కలిపే అంశంపై కేంద్ర ప్రభుత్వ మార్గ సూచీని విడుదల చేస్తూ ఆయన మాట్లాడారు.

పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలపి వినియోగించడానికి 2022ను, 20 శాతం కలపడానికి 2030ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం గతేడాది వెల్లడించింది. ప్రస్తుతం 8.5 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. 2014లో ఇది కేవలం 1 - 1.5 శాతంగా ఉండేది. ముందుగా నిర్ణయించకున్న ప్రకారం కాకుండా 2025 నాటికే 20శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మోదీ వివరించారు. ఇథనాల్‌ సేకరణకు గతేడాది ఆయిల్‌ కంపెనీలు రూ.21వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు.

ఇథనాల్‌ వినియోగం వల్ల పర్యావరణానికి మేలు చేకూరడమే కాకుండా రైతులకు మరింత ఆదాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు పలువురు రైతులతో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ఇథనాల్‌ వల్ల ఎలా తమ ఆదాయం ఎలా పెరిగిందో ప్రధానికి వివరించారు. వాతావరణ మార్పులు, పునరుత్పదక ఇంధన వినియోగానికి కట్టుబడి ఈ సందర్భంగా మోదీ తెలిపారు. చెరకుతో పాటు గోధుమలు, బియ్యం, ఇతర వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్‌ను తయారుచేస్తారు. ఇది రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయంగా ఉపయోగపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని