India-China: భారత్‌-చైనా చర్చలు.. సరిహద్దు నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి

భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖలో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చల్లబర్చేందుకు ఇరు దేశాల సైనికాధికారులు చేసిన ప్రయత్నాల్లో ముందడుగు పడింది.

Published : 09 Sep 2022 01:51 IST

గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి వెనక్కి వెళ్లడంపై సంయుక్త ప్రకటన

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖలో (Line of Actual Control) నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చల్లబర్చేందుకు ఇరు దేశాల సైనికాధికారులు చేసిన ప్రయత్నాల్లో ముందడుగు పడింది. ముఖ్యంగా గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ (Gogra Hot Springs) నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్‌-చైనా కార్ప్స్‌ కమాండర్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీంతో 2020కు ముందు స్థానానికి చైనా బలగాలు వెళ్లనున్నట్లు సమాచారం.

జూన్‌ 2020న జరిగిన గల్వాన్‌ ఘటన అనంతరం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో అక్కడ శాంతియుత వాతావరణాన్ని తెచ్చేందుకు భారత్‌-చైనా సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల 16వ విడతలో భాగంగా మేజర్‌ జనరల్‌ స్థాయిలో చర్చలు జరిపారు. ఇలా ఇప్పటివరకు జరిపిన సంప్రదింపుల ఫలితంగా పాంగాంగ్‌ సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17న జరిగిన చర్చల అనంతరం గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి ఇరుదేశాల బలగాలు, సైనిక సంపత్తిని వెనక్కి తీసుకోవాలని తాజాగా నిర్ణయించాయి. దీంతో సరిహద్దులో శాంతి నెలకొంటుందని ఇరుదేశాల సైనికాధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని