MEA: పాక్‌లో ఆరుగురు భారత ఖైదీల మృతి ఆందోళనకరం: కేంద్రం

గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు.

Published : 07 Oct 2022 21:45 IST

దిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఈ అంశాన్ని పాకిస్థాన్‌ వద్ద లేవనెత్తినట్టు  వెల్లడించారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే, వీరంతా పాకిస్థాన్‌లో శిక్షను పూర్తి చేసుకున్నవారేనని తెలిపారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉన్న భారతీయ ఖైదీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని గుర్తుచేశారు. అలాగే, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో ఇటీవల పాకిస్థాన్‌ యూఎస్‌ రాయబారి డొనాల్డ్‌ బ్లోమే పర్యటనపై అభ్యంతరాలను అమెరికాకు తెలిపామన్నారు. పీవోకేలో ఆయన సమావేశాలు నిర్వహించడం పట్ల కూడా అభ్యంతరం చెప్పినట్టు చెప్పారు.

భారత్‌-చైనా సరిహద్దులో పరిస్థితులు ఇంకా అలానే..

భారత్‌-చైనా సరిహద్దు వివాదం అంశంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రాలేదని కేంద్రం వెల్లడించింది. ‘‘భారత్‌-చైనా మధ్య పరిస్థితులు సాధారణ స్థాయికి రాలేదు. అయితే కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతి స్థాపనకు ఇరు దేశాలూ కృషి చేయాలి’’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని