ఒక్కరోజే 80వేలకు పైగా కరోనా కేసులు 

దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. కరోనా రెండో దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది.

Updated : 02 Apr 2021 11:17 IST

469 మరణాలు

మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. కరోనా రెండో దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131 చేరింది. గడిచిన 24 గంటల్లో 469 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తంగా 1,63,396 మంది ఈ మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. క్రియాశీల కేసుల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 6,14,696కి చేరింది.  క్రియాశీల రేటు 4.78 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో 1.25 శాతానికి తగ్గిన క్రియాశీల రేటులో ఇప్పుడు భారీ పెరుగుదల కనిపిస్తుడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్లిష్ట సమయంలో కొవిడ్‌ నుంచి కోలుకునే వారి గణాంకాలు కాస్త ఊరటకలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 50,356 మంది వైరస్‌ను జయించారు. మొత్తం రికవరీలు 1.15 కోట్లు దాటగా.. ఆ రేటు 93.89 శాతానికి తగ్గింది. 

మహారాష్ట్రలో ఉగ్రరూపం..

మహరాష్ట్రను కరోనా పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా బయటపడుతోన్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఆ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. నిన్న 43,183 మందికి పాజిటివ్‌గా తేలగా..249 మంది మరణించారు.  మొత్తంగా 28లక్షల మందికి పైగా కరోనా సోకగా..24 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 3,67,897 క్రియాశీల కేసులున్నాయి. 

నిన్న 36.7లక్షల మందికి టీకా..
దేశవ్యాప్తంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందిస్తున్నారు. ఏప్రిల్ ఒకటిన కేంద్రం 36,71,242 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. మొత్తంగా 6.87 కోట్ల మందికి టీకాలు అందాయి. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని