Corona: 3లక్షలు దాటిన కొత్త కేసులు

కరోనావైరస్ భారత్‌ను చుట్టుముట్టి, ఊపిరాడనివ్వడం లేదు. దాంతో గతంలో లేని ఉద్ధృతితో ప్రభుత్వాలు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated : 22 Apr 2021 10:31 IST

2,104 మంది మృత్యుఒడికి .. 

దిల్లీ: కరోనా వైరస్ భారత్‌ను చుట్టుముట్టి, ఊపిరాడనివ్వడం లేదు. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో ప్రభుత్వాలు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక రోజులో మూడు లక్షలకు పైగా కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో దేశంలో మహమ్మారి బుసలు కొడుతోంది. తాజాగా దేశంలో ఒక్కరోజే 3.14లక్షల మంది కరోనా బారినపడగా.. అగ్రరాజ్యం అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు భారత్‌లోనే నమోదవడం గమనార్హం. అంతకుముందు అమెరికాలో 24 గంటల్లో 3.07లక్షల కేసులు బయటపడ్డాయి. 

గడిచిన 24 గంటల్లో 16,51,711మంది నమూనాలను పరీక్షించగా.. 3,14,835 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశంలోకి మహమ్మారి ప్రవేశించి తరవాత ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. వరసగా రెండో రోజు 2వేలకు పైగా మరణాలు సంభవించాయి. తాజాగా 2,104 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దాంతో మొత్తం కేసులు 1,59,30,965కి చేరగా..1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో అమెరికాలో ఒక రోజులో మూడులక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆ తరవాత ఆ స్థాయి విజృంభణ భారత్‌లోనే కనిపిస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

అలాగే వైరస్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 22లక్షలకు పైబడగా.. ఆ రేటు 13.82 శాతానికి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 1,78,841 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో కోటీ 34లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయి కలవరపెడుతోంది. మరోవైపు, నిన్న 22,11,334 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. మొత్తంగా 13.23 కోట్ల మంది టీకా తీసుకున్నారు. 

రాష్ట్రాల్లో కలవరం..

మహరాష్ట్రలో తాజాగా 67,468 మంది కరోనా బారిన పడగా..568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రానికి దేశ రాజధాని దిల్లీ(24,638), ఉత్తరప్రదేశ్‌(33,106) తోడయ్యాయి. దిల్లీలో 249 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇక, చత్తీస్‌గఢ్‌(193), యూపీ(187), గుజరాత్(125), కర్ణాటక(116)లో గడిచిన 24 గంటల్లో 100పైగా మరణాలు సంభవించాయి. ఎన్నికల రాష్ట్రం పశ్చిమ్ బెంగాల్‌ ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోంది. తాజాగా అక్కడ 10,784 కొత్త కేసులు కేసులు, 58 మరణాలు సంభవించాయి.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని