India Corona: మళ్లీ 12 వేలకు పైగా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న బాధితుల సంఖ్య..!

దేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ క్రమంగా విస్తరిస్తోంది. మరోరోజు 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

Published : 17 Jun 2022 10:10 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ క్రమంగా విస్తరిస్తోంది. వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెల్లడించింది. 

గురువారం 5.19 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 12,847 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివిటీ రేటు రెండు శాతంపైనే కొనసాగుతోంది. మహారాష్ట్ర(4,255), కేరళ(3,419), దిల్లీ(1,323), కర్ణాటక(833), తమిళనాడు, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దిల్లీలో 10 రోజుల వ్యవధిలో 7వేలకు పైగా కేసులువచ్చాయి. జూన్‌ 7న 1.92 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జూన్‌ 15 నాటికి 7.01 శాతానికి ఎగబాకింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. 

క్రియాశీల కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 63,063కి చేరింది. దీంతో మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.15 శాతానికి పెరిగింది. నిన్న 7,985 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.64 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారు. నిన్న 15.27 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 195.8 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని