corona: కాస్త తగ్గిన కేసులు.. మరణాలు

కరోనా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ..ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది.

Updated : 15 May 2021 10:02 IST

36.73 లక్షల క్రియాశీల కేసులు

దిల్లీ: కరోనా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ..ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది. తాజాగా 16,93,093 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,26,098 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరసగా రెండోరోజు కూడా కొత్త కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 3,890 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 2.43కోట్ల మందికి వైరస్ సోకగా..2,66,207 మంది ప్రాణాలు కోల్పోయారు. 

అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఒకింత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం 36,73,802 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,53,299 మంది కోలుకున్నారు. క్రియాశీల రేటు 15.41 శాతానికి చేరగా..రికవరీ రేటు 83.50 శాతంగా ఉంది. 

మరోవైపు, దేశవ్యాప్తంగా నడుస్తోన్న టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. నిన్న 11,03,625 మంది టీకా వేయించుకున్నారు. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 18,04,57,579 మందికి టీకా అందింది. 

మహారాష్ట్ర, దిల్లీలో అదుపులో కరోనా!

మహారాష్ట్రలో కొవిడ్ ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 తరవాత మొదటిసారి కొత్త కేసుల సంఖ్య 40వేల దిగువకు చేరింది. తాజాగా 39,923 మందికి కరోనా సోకగా..695 మంది ప్రాణాలు వదిలారని ఆ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొద్ది రోజుల క్రితం చోటుచేసుకున్న మరణాలను కూడా ఈ సంఖ్యలో చేర్చినట్లు పేర్కొంది. దిల్లీలో కూడా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న 8,506 మందికి కరోనా సోకగా..289 మంది మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని