S400: పంజాబ్‌లో ఎస్‌-400 మోహరింపు.. ఏక కాలంలో ఇద్దరు శత్రువులపై గురి..!

మూడేళ్లపాటు భారత్‌ ఎదురు చూపులకు ముగింపు పడింది. ఇటీవల చేతికందిన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్‌ పంజాబ్‌ వద్ద మోహరింపులు మొదలయ్యాయి. సాధారణంగా భారత్‌ ఆయుధ మోహరింపులపై అధికారక ప్రకటనలు చేయడం చాలా అరుదు.

Updated : 21 Dec 2021 16:59 IST

 భారత గగనతలానికి మరింత భరోసా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మూడేళ్లపాటు భారత్‌ ఎదురుచూపులకు ముగింపు పడింది. ఇటీవల చేతికందిన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్‌ పంజాబ్‌ వద్ద మోహరించడం ప్రారంభించింది. సాధారణంగా భారత్‌ ఆయుధ మోహరింపులపై అధికారక ప్రకటనలు చేయడం చాలా అరుదు. ఎస్‌-400ల మోహరింపును రక్షణమంత్రిత్వ శాఖ వర్గాలు పలు ఆంగ్ల పత్రికల వద్ద ధ్రువీకరించాయి. ‘‘ఎస్‌-400 ట్రయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థ తొలి స్క్వాడ్రన్‌ను పంజాబ్‌ సెక్టార్‌లో మోహరిస్తున్నారు ’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటనకు కొద్ది వారాల ముందే ఎస్‌-400 తొలిబ్యాచ్‌ ఎగుమతులు మొదలు పెట్టినట్లు  రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ మిలిటరీ-టెక్నికల్‌ కోఆపరేషన్‌(ఎఫ్‌ఎస్‌ఎంటీసీ)కు చెందిన దిమిత్రి షుగేవ్‌ అనే అధికారి వెల్లడించారు.

అసలు ఈ ఎస్‌-400 ఏమిటీ..?

ఎస్‌-400 ట్రయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థ. నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకొనేందుకు రష్యా దీనిని వాడుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్‌ జెట్స్‌, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళతం చేసిన ఓ ప్యాకేజ్ అన్నమాట‌. దీనిని 2007 సంవత్సరంలో రష్యా  సైన్యంలోకి ప్రవేశపెట్టింది. అదే ఏడాది జులైలో ఆకాశంలో సెకన్‌కు 2,800 మీటర్ల  వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఎస్‌-400 ఛేదించినట్లు రష్యా పేర్కొంది.

ఏఏ ఆయుధాలు ఉంటాయి..?  

* ఉరాల్‌-532301 హెవీడ్యూటీ ట్రక్‌పై అమర్చిన మొబైల్‌ కమాండ్‌ పోస్ట్‌ ఉంటుంది. ఇది ఏక కాలంలో ఎనిమిది క్షిపణులను సమన్వయపర్చగలదు. 

* ‘బిగ్‌బర్డ్‌’ బ్యాటిల్‌ అక్విజేషన్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌ రాడార్‌ను ఇస్తారు. ఇది అత్యధికంగా 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. దీని రక్షణకు ‘ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌ కౌంటర్‌ మెజర్స్‌’ (ఈసీసీఎం) సూట్‌ కూడా ఉంది. ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌, జామింగ్‌లను తట్టుకోగలదు.

* ‘గ్రేవ్‌స్టోన్‌’ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ ఫైర్‌ కంట్రోల్‌ రాడార్‌ ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వాడే మల్టీ ఫంక్షన్‌ రాడార్. ఏకకాలంలో 100 లక్ష్యాలను ట్రాక్‌ చేయగలదు. ముందు ఛేదించాల్సిన లక్ష్యాలను గుర్తించి వాటికి ఆటోమేటిక్‌గా ప్రాధాన్యం ఇస్తుంది. ఎస్‌-400 వ్యవస్థలోని మిసైల్‌ లాంఛర్లకు ఆదేశాలు ఇస్తుంది. అంతేకాదు. క్షిపణి ప్రయాణించే క్రమంలో దానికి లక్ష్యాలకు సంబంధించిన గైడెన్స్‌ ఇస్తుంది. దీని రక్షణకు ఈసీసీఎం సూట్‌ కూడా ఉంది.

* ‘చెస్‌బోర్డ్‌’ ఆల్‌-ఆల్టిట్యూడ్‌ అక్విజేషన్‌ రాడార్‌ కూడా ఉంటుంది. దీనిలో ఆప్షనల్‌ 3డీ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ అక్విజేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఈ రాడార్‌ను వాడి లాంఛర్లకు లక్ష్యాలను సూచించవచ్చు.

* ‘చెస్‌బోర్డ్‌’ ఆల్‌-ఆల్టిట్యూడ్‌ అక్విజేషన్‌ రాడార్‌కు అనుబంధంగా రాడర్లను అమర్చేందుకు మొబైల్‌ మాస్ట్‌ సిస్టమ్‌ (మొబైల్‌ టవర్‌ వంటిది) ఉంటుంది.

* నాలుగు మిసైల్‌ ట్యూబ్స్‌ ఉన్న మొబైల్‌ లాంఛర్లు ఉంటాయి. ఇవి ఒక్కో స్క్వాడ్రన్‌లో 16 వరకు ఉన్నాయి . భారత్‌ ఐదు ఎస్‌-400 వ్యవస్థలను కొనుగోలు చేయడంతో మొత్తం 80 లాంఛర్లు మనకు లభించనున్నాయి. 

* ఎస్‌-400లో మొత్తం ఐదు రకాల క్షిపణులను వినియోగిస్తున్నారు. భారత్‌ కచ్చితంగా వేటిని కొనుగోలు చేసిందో  వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. కానీ, వీటి రేంజి 400 కిమీ, 250 కిమీ, 200 కిమీ, 120 కిమీ, 40కిమీ.

* లాజిస్టిక్స్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌ఎస్‌) ప్రతి వ్యవస్థలో ఉంటుంది. దీనిలో క్షిపణులు భద్రపర్చేందుకు, నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. వీటిల్లో క్షిపణుల లోడింగ్‌కు అవసరమైన పరికరాలు కూడా ఉంటాయి. 

పంజాబ్‌ సెక్టార్‌లో ఎందుకు మోహరించారు..?

ఎస్‌-400 వ్యవస్థలోని రాడార్లు 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలవు. దీనిని కేవలం 5 నిమిషాల్లో దాడికి సిద్ధం చేయవచ్చు. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ, కశ్మీర్‌, నియంత్రణ రేఖ దీని పరిధిలోకి వచ్చేలా  పంజాబ్‌ సెక్టార్‌లో మోహరిస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా సరిహద్దులకు, దేశంలోని కీలక ప్రాంతాలకు ఈ గగనతల రక్షణ వ్యవస్థ అండగా ఉంటుంది. ఈ వ్యవస్థలోని క్షిపణి లాంఛర్లన్నీ దళాల వ్యూహాలకు అనుకూలంగా వేర్వేరు చోట్ల మోహరించే వెసులుబాటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని