Coronavirus: భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉంది.. మరో వైరస్‌ ఉప్పెన రాకపోవచ్చు..!

చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ‘BF.7’ కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ అన్నారు. 

Updated : 23 Dec 2022 18:02 IST

దిల్లీ: చైనా, జపాన్‌, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో మరోమారు కరోనావైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ప్రస్తుత వేరియంట్ల విషయంలో కలవరపడాల్సిన పనిలేదని ప్రముఖ వైరాలజిస్ట్‌ గగన్‌దీప్ కాంగ్ అన్నారు. మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందని.. మరో వైరస్ ఉప్పెన రాకపోవచ్చని అంచనా వేశారు.

‘ప్రస్తుతం భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉంది. మన దగ్గర స్వల్ప స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు XBB, BF.7 బయటపడ్డాయి. కానీ వాటివల్ల కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. ఇంతకంటే అధికస్థాయిలో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చేసే వేరియంట్ లేకపోవడంతో మరో వైరస్ ఉప్పెన ఉండకపోవచ్చు’ అని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా.. చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ‘BF.7’ కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. కేసులతోపాటు కొవిడ్‌ మరణాలూ భారీగానే ఉన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనిపై కాంగ్ స్పందించారు. ‘ఇప్పటికే మన దేశం చవిచూసిన విషాదాన్ని చైనా ఎదుర్కోంటోంది. అయితే దాంతోపాటు మనకు ఆందోళన కలిగించే విషయం మరొకటి ఉంది. వైరస్ భారీ స్థాయిలో వ్యాప్తి చెందుతుంటే.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని