PM Modi: భారత ఆర్థికాభివృద్ధి.. ప్రజాస్వామ్య ఘనతే: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యానికి భారత్‌ ( India)  మాతృమూర్తి వంటిదని ప్రధాని మోదీ (PM Naredra Modi) అన్నారు. ప్రజాస్వామ్యంపై అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ (Joe Biden) సారధ్యంలో అంతర్జాతీయంగా నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

Updated : 29 Mar 2023 21:31 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్ల (Global Challenges)ను అధిగమించి భారత్‌  ( India) ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థ (Economy)గా అవతరించనుందని ప్రధాని మోదీ (PM Naredra Modi) అన్నారు. ప్రజాస్వామ్యం (Democracy) వల్లనే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. ఈ సందర్భంగా  భారత్‌ను ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రజాస్వామ్యంపై అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ (Joe Biden) సారధ్యంలో అంతర్జాతీయంగా నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో కోస్టారికా అధ్యక్షుడు రొడ్రిగో ఛావెస్‌ రోబ్లెస్‌ (Rodrigo Chaves Robles), జాంబియా ప్రెసిడెంట్‌ హకైండె హచిలెమా (Hakainde Hichilema), నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుట్టే(Mark Rutte), దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol) పాల్గొన్నారు. 

‘‘ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సవాళ్లున్నా.. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన  ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది. ప్రజాస్వామ్యం సాధించిన ఘనత గురించి  ప్రపంచానికి చెప్పేందుకు ఇదే అత్యుత్తమ ఉదాహరణ. నాయకుడిని ఎన్నుకోవడం దేశ ప్రజల మొదటి కర్తవ్యంగా మా ఇతిహాసం మహాభారతంలో చెప్పారు. భారత వేదాల్లో కూడా రాజకీయ శక్తి గురించి అనే సందర్భాల్లో వివరించారు. పురాతన భారతంలో పాలకులు వంశపారంపర్యంగా వచ్చినవారు కాదు అనేందుకు అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ప్రజాస్వామ్యం అనేది కేవలం నిర్మాణాత్మక వ్యవస్థ మాత్రమే కాదు.. అది ఆత్మతో సమానం. ప్రతి పౌరుడి అవసరాలు, ఆకాంక్షలకు సమప్రాధాన్యం ఉంటుందనే విశ్వాసంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మా ప్రభుత్వం సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకు సాగుతుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి వంటగ్యాస్ సరఫరా, నిల్వచేసిన నీటిని అందరికీ అందించడం వంటి వివిధ రకాల కార్యక్రమాలను దేశంలోని ప్రజల సమష్ఠి భాగస్వామ్యంతోనే విజయవంతమవుతున్నాయని చెప్పారు. కరోనాపై  దేశ ప్రజలంగా ఐకమత్యంగా పోరాడిన సందర్భాన్ని ప్రధాని ప్రత్యేకంగా కొనియాడారు. వసుధైక కుటుంబం నినాదంతోనే వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని