India-China: మరిన్ని ఘర్షణలు జరగొచ్చు : తాజా నివేదికలో ప్రస్తావన

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా (China) ఆక్రమణలకు పాల్పడుతుందంటూ వార్తలు వస్తోన్న తరుణంలో ఇటీవల వచ్చిన ఓ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. ఇరు దేశాల సైనికుల మధ్య మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అందులో పేర్కొంది.

Published : 27 Jan 2023 19:49 IST

దిల్లీ: వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా (China) కొన్నేళ్లుగా ఆక్రమణలకు పాల్పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల డీజీపీల సదస్సులో సమర్పించిన ఓ నివేదికలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. భారత్‌- చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్‌ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ నివేదికను విశ్లేషిస్తూ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని వెలువరించింది. 

కొన్నేళ్లుగా భారత్‌- చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రతా దళాల నుంచి నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ‘ఈ ప్రాంతంలో తమ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చైనా సైన్యం(పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) మౌలిక సదుపాయాలను ముమ్మరంగా చేపడుతోంది. కొన్నేళ్లుగా జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలను విశ్లేషిస్తే.. 2013- 14 తర్వాత ప్రతి రెండు, మూడేళ్లకు వీటి తీవ్రత మరింత పెరిగింది.  ఇలా ఇరు దేశాల సైనిక శక్తుల మధ్య ఘర్షణలు తరచూ చోటుచేసుకుంటున్నాయి’ అని తాజా నివేదిక పేర్కొంది. ఈ క్రమంలోనే తూర్పు లద్దాఖ్‌లో చాలా గస్తీ పాయింట్లను భారత్‌ కోల్పోయిందని తెలిపింది. 

తూర్పు లద్దాఖ్‌లో 2020లో జరిగిన ఘర్షణల్లో 24 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇరు దేశాలమధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే, సైనికాధికారుల మధ్య పలు దఫాల్లో చర్చలు జరగడంతో అవి ఒక కొలిక్కి వస్తున్నట్లే కనిపించాయి. కానీ, ఇదే సమయంలో రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకోవడంతోపాటు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని తెలియడంతో అవి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని