వినూత్న విమాన ప్రయాణం.. ఎక్కిన చోటే దిగాలి!

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా విమాన ప్రయాణాలను మిస్‌ అవుతున్న ప్రయాణికుల కోసం ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌ వినూత్న సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లైట్‌ టు నోవేర్‌’ పేరుతో నడిపే ఈ విమానంలో సిడ్నీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని, ఏడు

Published : 26 Sep 2020 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా విమాన ప్రయాణాలను మిస్‌ అవుతున్న ప్రయాణికుల కోసం ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌ వినూత్న సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లైట్‌ టు నోవేర్‌’ పేరుతో నడిపే ఈ విమానంలో సిడ్నీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని, ఏడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టి.. మళ్లీ సిడ్నీ విమానాశ్రయంలోనే దింపేస్తారట. ప్రయాణికులకు ఈ ఏడు గంటల్లో ప్రముఖ సందర్శక ప్రాంతాలు క్వీన్స్‌లాండ్‌, న్యూ సౌత్‌ వేల్స్‌, గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌, ఊలూరు, సిడ్నీ హార్బర్‌ తదితర ప్రాంతాలను విమానంలోనుంచే చూపిస్తారట. అక్టోబర్‌ 10న ఈ ప్రయాణం ఉండగా.. దీనికి సంబంధించిన టికెట్లను ఇటీవల క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌ ఆన్‌లైన్‌లో పెట్టగా పది నిమిషాల్లో అమ్ముడుపోవడం విశేషం. ఇప్పుడు ఇలాంటి సేవలనే మన దేశంలో ప్రారంభించేందుకు ఎయిర్‌ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

భారత్‌లోనూ విమాన ప్రయాణాలను మిస్‌ అవుతున్న వారి కోసం ఎయిర్‌ఇండియా ‘ఫ్లైట్‌ టు నోవేర్‌’ పేరుతోనే సేవలను అందుబాటులోకి తీసుకురానుందట. ఒక విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానం.. పలు సందర్శక ప్రాంతాలను గాల్లోనే చుట్టేసి.. తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే ఏయే విమానాశ్రయాల్లో ఈ సేవలు తీసుకొస్తారు? ఏయే సందర్శక ప్రాంతాల మీదుగా తిప్పుతారు? ఎంత సమయం ప్రయాణం ఉంటుందనే వివరాలు ఇంకా తెలియలేదు. ఈ సేవల ప్రారంభించడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ సేవలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భారత్‌లోనే కాదు.. సింగపూర్‌లోనూ ఇలాంటి సేవలు ప్రారంభించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోందట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని