స్పుత్నిక్‌ టీకా రాక మరింత ఆలస్యమేనా..?

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ భారత్‌ చేరుకోవడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్‌ టీకాలు మే చివరినాటికి భారత్‌ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

Published : 23 Apr 2021 01:08 IST

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ భారత్‌ చేరుకోవడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్‌ టీకాలు మే చివరి నాటికి భారత్‌ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. దీంతో భారత్‌లో టీకా పంపిణీని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమని నిపుణులు భావిస్తున్నారు.

‘రష్యా నుంచి స్పుత్నిక్‌ టీకా తొలి బ్యాచ్‌ను ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మే నెల చివరినాటికి వీటిని దిగుమతి చేసుకునేందుకు మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని భారత్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ రాయిటర్స్‌ వార్తా సంస్థకు వెల్లడించింది. అంతేకాకుండా స్పుత్నిక్‌ టీకా తయారీని భారత్‌లో మరికొన్ని నెలల్లోనే ప్రారంభిస్తామని తెలిపింది. భారత్‌లో తయారయ్యే స్పుత్నిక్‌ టీకా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నామని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్‌ నెలలోనే వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమవుతుందని రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ గతవారం వెల్లడించారు. అయినప్పటికీ టీకా దిగుమతి ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, స్పుత్నిక్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు ఆర్‌డీఐఎఫ్ గతేడాది సెప్టెంబర్‌లోనే డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా.. దాదాపు 1600 మంది వాలంటీర్లపై రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్వహించింది. అనంతరం అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకోగా.. ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి ఏప్రిల్‌ 12న పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ పంపిన సిఫార్సులను పరిశీలించిన డీసీజీఐ.. భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు మూడో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. ఇక స్పుత్నిక్‌ టీకాను ఆమోదించిన 60వ దేశంగా భారత్‌ నిలిచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లలో స్పుత్నిక్‌-వి రెండో స్థానంలో ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని