వ్యాక్సిన్‌ ఎగుమతి ముమ్మరం చేసిన భారత్‌!

ఇప్పటికే స్వదేశంలో అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మొరాకో.....

Updated : 23 Jan 2021 13:20 IST

దిల్లీ: ఇప్పటికే స్వదేశంలో అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మొరాకో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు ముందస్తు ఒప్పందాల ప్రకారం టీకా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. భూటాన్‌కు లక్షా 50వేల డోసులు, మాల్దీవులకు లక్ష, బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, నేపాల్‌కు పది లక్షలు, మయన్మార్‌కు 15లక్షలు, సెచెల్లీస్‌కు 50వేల చొప్పున కొవిషీల్డ్‌ డోసులను సరఫరా చేశామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

పొరుగు దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడంలో భాగంగా, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు సరఫరా చేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, పాకిస్థాన్‌కు వ్యాక్సిన్‌ సరఫరా చేస్తారా అనే ప్రశ్నకు.. మన ప్రభుత్వంతో ఒప్పంద వివరాల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. ఇక బ్రెజిల్‌, మొరాకో దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్‌లను పంపించామని, నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చిన తర్వాత శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌లకు కూడా సరఫరా చేస్తామన్నారు. ఓవైపు దేశ అవసరాలను అనుగుణంగా వ్యాక్సిన్‌లను నిల్వ చేసుకుంటూనే, మరోవైపు విదేశాలకు ఎగుమతి కొనసాగిస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

13 వేల వాలంటీర్లకు రెండో డోసు..
భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి తుది దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 25,800 మందికి ప్రయోగ టీకా అందించగా, వీరిలో 13వేల మందికి రెండో డోసు ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో వెల్లడించారు. మరోవైపు తొలి రెండు దశ ప్రయోగాల్లో కొవాగ్జిన్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుందని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది.

ఇవీ చదవండి..
సమర్థవంతంగా కొవాగ్జిన్‌: లాన్సెట్‌ పరిశీలన
కొవిడ్‌ టీకాపై భయం తొలగించాలి: మోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని