చైనా దుశ్చర్యలను తిప్పికొట్టడానికి సిద్ధం!

సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తే.. భారత్‌ కూడా అదే రీతిలో స్పందిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా అన్నారు. డ్రాగన్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు.......

Updated : 24 Jan 2021 13:27 IST

స్పష్టం చేసిన వాయుసేనాధిపతి భదౌరియా

జోధ్‌పూర్‌: సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తే.. భారత్‌ కూడా అదే రీతిలో స్పందిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా స్పష్టం చేశారు. డ్రాగన్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు భారత సేనలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జోధ్‌పూర్‌లో భారత్‌ వాయుసేన, ఫ్రాన్స్‌ వాయు సేన, అంతరిక్ష దళాలు ‘డెసర్ట్‌ నైట్‌-21’ పేరిట సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌-చైనాలు నేడు 9వ విడత సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భదౌరియా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.  

డెసర్ట్‌ నైట్‌-21 ప్రస్తుతానికి కేవలం పశ్చిమ సరిహద్దుల్లో మాత్రమే కొనసాగుతోందని తెలిపారు. తూర్పు సరిహద్దులకు దీన్ని విస్తరించడం లేదని స్పష్టం చేశారు. ఇవి ఇతర దేశాలపై దాడికి సన్నాహకంగా చేస్తున్న విన్యాసాలు కావని వివరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చాయని.. మరో మూడు ఈ నెలాఖరుకల్లా భారత్‌కు చేరుకుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా అన్ని రఫేల్‌ విమానాలు భారత వాయుసేనలో చేరతాయన్నారు. పైలట్లకు సమగ్ర శిక్షణ కొనసాగుతోందన్నారు.

జోధ్‌పూర్‌లోని వాయుసేన స్థావరంలో జనవరి 20న ప్రారంభమైన డెసర్ట్‌ నైట్‌-21 సైనిక విన్యాసాలు నేటితో ముగియనున్నాయి. ఈ విన్యాసాల్లో ముఖ్యంగా రఫేల్‌ ఆపరేషన్‌, ఇరు దేశాల దళాల మధ్య సమన్వయంపై దృష్టి సారించారు. ఈ విన్యాసాల్లో.. రఫేల్‌, ఎయిర్‌బస్‌ ఏ-330 మల్టీ రోల్‌ ట్యాంకర్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఏ-400ఎం టాక్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సహా మొత్తం 175 మంది సైనికుల్ని ఫ్రాన్స్‌ రంగంలోకి దింపగా.. భారత్‌ రఫేల్‌, మిరాజ్‌, సుఖోయ్‌లతో విన్యాసాల్లో పాల్గొన్నాయి.

ఇవీ చదవండి...

అట్టుడుకుతున్న రష్యా!

హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు పాక్‌లో జైలు శిక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని