చైనా తగ్గించేదాకా.. భారత్‌ తగ్గదు

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్లే తొలి బాధ్యత చైనాదేనని, ఆ ప్రక్రియను డ్రాగన్‌ మొదలుపెడితేనే భారత్‌ కూడా సైన్యాన్ని తగ్గిస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంగా చెప్పారు.

Published : 23 Jan 2021 11:25 IST

లద్దాఖ్‌ ప్రతిష్టంభనపై రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి మళ్లించే తొలి బాధ్యత చైనాదేనని, ఆ ప్రక్రియను డ్రాగన్‌ మొదలుపెడితేనే భారత్‌ కూడా సైన్యాన్ని తగ్గిస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంగా చెప్పారు. లద్దాఖ్‌ సరిహద్దు వివాదంతో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘‘సరిహద్దుల్లో బలగాల తగ్గింపు జరగదు. దీనిపై చైనా తొలి బాధ్యత తీసుకుని సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లే వరకు భారత్‌ బలగాలను తగ్గించబోదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మిస్తుందన్న వార్తలపై ప్రశ్నించగా.. రక్షణమంత్రి స్పందిస్తూ.. ‘‘గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా అలాంటి నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పుడు భారత్‌ కూడా వాస్తవాధీన రేఖ సమీపంలో స్థానికులు, భద్రతాసిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టింది’’ అని తెలిపారు. 

అంతేగాక, చర్చల ద్వారానే ఇరు దేశాల నడుమ ప్రతిష్టంభన తొలగనుందని విశ్వాసం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌.. త్వరలోనే ఇందుకు సంబంధించి మరో విడత చర్చలు జరగనున్నట్లు చెప్పారు. జనవరి 19నే ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలిపారు. నేడు, లేదా ఆదివారం భారత్‌-చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగే అవకాశముందని వెల్లడించారు. 

గతేడాది మేలో లద్దాఖ్‌ సరిహద్దు వివాదంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత జూన్‌లో జరిగిన గల్వాన్‌ లోయ ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. అయితే సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఎనిమిది సార్లు చర్చలు జరిగినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. 

ఇవీ చదవండి..

చైనా మూలాలున్న ఫిన్‌టెక్‌ రుణ సంస్థలపై కేంద్రం దృష్టి

‘ట్రాక్టర్ల ర్యాలీలో మమ్మల్ని చంపేందుకు కుట్ర’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని