Delhi: చైనాతో చర్చలు.. అంతలోనే గల్వాన్‌లో భారత్ సైనికుల క్రికెట్‌!

లద్దాఖ్‌ (Ladakh)లోని గల్వాన్‌ (Galwan) ప్రాంతంలో భారత్‌ సైనికులు (Indian Army) క్రికెట్‌ ఆడుతున్న ఫొటోలను ఇండియన్‌ ఆర్మీ ట్విటర్‌లో పోస్టు చేసింది. భారత్‌ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌.. చైనా విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపిన తర్వాతి రోజునే ఇలా ట్వీట్‌ చేయడం గమనార్హం.

Published : 04 Mar 2023 00:22 IST

దిల్లీ: భారత్‌-చైనాల (India-China) మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన తూర్పు లద్దాఖ్‌ (Ladakh)లోని గల్వాన్‌ (Galwan) ప్రాంతంలో భారత్‌ సైనికులు క్రికెట్‌ ఆడుతున్న ఫొటోలను భారత్‌ సైన్యం (Indian Army) అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. గల్వాన్‌లో కచ్చితంగా ఎక్కడ ఆడుతున్నారనే విషయం చెప్పకపోయినప్పటికీ.. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14కి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆడుతున్న ప్రాంతం ఉండొచ్చని జాతీయ మీడియావర్గాల కథనాలు వెల్లడించాయి. 2020 మే నెలలో ఇరుదేశాల సైనికుల మధ్య గల్వాన్‌ ప్రాంతంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. 20 మంది భారత్‌ సైనికులు వీరమరణం పొందగా.. చైనా మాత్రం మృతులు, క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. దిల్లీలో నిర్వహిస్తున్న జీ20 సదస్సులో భాగంగా భారత్‌ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, చైనా విదేశాంగశాఖ మంత్రి చిన్‌ గ్వాంగ్ ముఖాముఖి సమావేశమైన తర్వాతి రోజునే ఇండియన్‌ ఆర్మీ ఫొటోలను పోస్టు చేయడం గమనార్హం.

‘‘పటియాలా బ్రిగేడ్‌ త్రిశూల్‌ డివిజన్‌ చాలా ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలను నిర్వహించింది. అది కూడా ఎత్తైన, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే  ప్రాంతంలో.. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం’’ అంటూ ఇండియన్‌ ఆర్మీకి చెందిన లేహ్‌ బేస్డ్‌ 14 సైనిక బృందం ట్విటర్‌లో రాసుకొచ్చింది. గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌-చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి.. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14కు 1.5 కిలోమీటర్ల దూరం నుంచి బఫర్‌ జోన్‌గా ప్రకటించారు. తాజాగా బఫర్‌జోన్‌ను సమీపంలోనే భారతసైన్యం క్రికెట్‌ ఆడినట్లు తెలుస్తోంది.

భారత్‌-చైనాల మధ్య సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాల కమాండర్‌ స్థాయి అధికారులు ఇప్పటి వరకు 17 విడతలుగా చర్చలు జరిపినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఉద్రిక్తతలు కాస్త చల్లారడం మినహా.. శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఓ వైపు బఫర్‌ జోన్‌ నుంచి వెనక్కి వెళుతున్నామని చెబుతున్న చైనా... అవకాశం చూసి భారత్‌ భూభాగంలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తోంది. చైనా చర్యలను తిప్పికొట్టేందుకు భారత్‌ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గురువారం దిల్లీలో చైనా విదేశాంగ శాఖ మంత్రి చిన్‌ గ్వాంగ్‌తో సమావేశమైన కేంద్ర మంత్రి జైశంకర్‌.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సవ్యంగా లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని