Kites: డ్రోన్లను వేటాడే గద్దలు.. భారత సైన్యం సరికొత్త ఆయుధం!

శత్రు దేశాల డ్రోన్ల పనిపట్టేందుకు భారత సైన్యం(Indian Army) సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే మొదటిసారి.

Published : 30 Nov 2022 01:34 IST

దిల్లీ: శత్రు దేశాల డ్రోన్ల పనిపట్టేందుకు భారత సైన్యం(Indian Army) సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో సాగుతోన్న భారత్, అమెరికాల ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తులు ‘యుద్ధ్ అభ్యాస్’లో భాగంగా ఈ ట్రైనింగ్‌ ఫలితాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా.. తొలుత ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేశారు. దాని శబ్దాన్ని గ్రహించిన ఓ ఆర్మీ శునకం.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే డ్రోన్లను వేటాడే శిక్షణ పొందిన ‘అర్జున్‌’ అనే గద్ద.. గాల్లోని ఆ డ్రోన్‌ ఆచూకీని పట్టేసి, దాన్ని కూల్చేసింది.

ఆర్మీ ఇప్పటికే శునకాలతోపాటు గద్దలకు శిక్షణ ఇచ్చి.. ఆయా సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తోంది. అయితే, శత్రు డ్రోన్లను వేటాడేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే తొలిసారని సైనిక అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పంజాబ్‌, జమ్మూ-కశ్మీర్‌ తదితర సరిహద్దు రాష్ట్రాల్లో కొంతకాలంగా తరచూ డ్రోన్ల చొరబాటు ఘటనలు నమోదవుతోన్న విషయం తెలిసిందే. డ్రోన్లతో గూఢచర్యం, స్మగ్లింగ్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో శిక్షణ పొందిన గద్దలు ఆర్మీకి మరింత చేదోడుగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని