Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి..

ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ పౌరుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం

Updated : 01 Mar 2022 16:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ పౌరుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం ఖార్కీవ్‌లో జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విటర్‌లో వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మృతుడిని కర్ణాటకలోని హవేరి జిల్లా వాసి నవీన్‌గా గుర్తించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సదరు విద్యార్థి ఖార్కివ్‌ నేషనల్ మెడికల్‌ యూనివర్శిటీలో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొంది. ఖార్కివ్‌లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు పాల్పడింది. అయితే అవి గురితప్పి నవీన్‌ ఉంటున్న నివాస ప్రాంతంపై పడినట్లు తెలుస్తోంది.

తాజా ఘటన నేపథ్యంలో భారత్‌లోని ఉక్రెయిన్‌, రష్యా రాయబారులతో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఖార్కివ్‌ సహా ఇతర నగరాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని రెండు దేశాలను కోరినట్లు ఎంఈఏ వెల్లడించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఆ నగర పరిసర ప్రాంతాల్లో తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ఆ నగరాన్ని వెంటనే వీడాలని ఈ ఉదయమే అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా రైళ్లు, ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో కీవ్‌ను వీడి సరిహద్దులకు రావాలని భారత విద్యార్థులు, పౌరులకు సూచించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఖార్కివ్‌లో భారత విద్యార్థి మృతిచెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడించడం గమనార్హం.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని