Data consumption: ‘డేటా వినియోగం ఇక్కడే అధికం.. నెలకు 12జీబీ వాడకం’

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతోంది. సామాన్యులకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించారు. ఆయన...

Published : 22 Oct 2021 22:41 IST

దిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతోంది. సామాన్యులకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించారు. ఆయన గతంలో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున వాడుతున్నారని చెప్పారు. ప్రతిష్ఠాత్మక ‘డిజిటల్‌ ఇండియా’ విజన్‌ సాకారం దిశగా.. ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత్‌ మార్కెట్‌లోకి వస్తున్నాయని వెల్లడించారు.

‘ప్రస్తుతం భారత్‌లో 118 కోట్ల మొబైల్ కనెక్షన్లు, 60 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. 70 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతమైన కనెక్టివిటీ బేస్ ఉంది. గత ఆరేడేళ్లలో అనుసంధాన రంగంలో మంచి పురోగతి సాధించాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), ఆధార్, కొవిన్ తదితర డిజిటల్ ఇండియా కార్యక్రమాలు చాలా వరకు ప్రజల జీవితాలను మార్చాయి’ అని శర్మ చెప్పుకొచ్చారు. దేశంలో ఫైబర్ ఆధారిత నెట్‌వర్క్‌ల విస్తరణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చాలావరకు టెలికాం ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌లకు మారిన నేపథ్యంలో.. స్థానికంగా కొత్త డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. మరోవైపు 2025 నాటికి దేశంలో డేటా వినియోగం రెట్టింపవుతుందని, ఒక్కొక్కరు నెలకు సగటున 25 జీబీ వరకు వినియోగిస్తారని స్వీడన్‌కు చెందిన టెలికమ్యూనికేషన్‌ సంస్థ ‘ఎరిక్సన్‌’ ఇటీవలే అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని