Rajnath Singh: ఆల్‌ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు

2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్లతో దేశ రక్షణారంగ ఎగుమతులు ఆల్‌టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 01 Apr 2023 19:05 IST

దిల్లీ: భారత్‌ నుంచి రక్షణ రంగ ఎగుమతులు(Defence Exports) ఆల్‌ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) వెల్లడించారు. దేశ ప్రగతికి ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైతం ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రంగంలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు అందిస్తున్నాయని చెప్పారు.

‘2022- 23లో దేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లతో ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. భారత్‌కు ఇది గొప్ప విజయం’ అని రాజ్‌నాథ్ సింగ్ శనివారం ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘ఎక్స్‌లెంట్‌. భారతీయుల ప్రతిభ, ‘మేక్ ఇన్ ఇండియా’ పట్ల గల ఉత్సాహానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఈ రంగంలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు అందిస్తున్నాయని ఇది నిరూపిస్తోంది. భారత్‌ను రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా మార్చే ప్రయత్నాలకు కేంద్రం మద్దతు ఇస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. రూ.1.75 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీతోపాటు 2024-25 నాటికి ఈ ఎగుమతులను రూ.35 వేల కోట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలోనే.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. అధికారిక వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.12,814 కోట్లు, 2020-21లో రూ.8,434 కోట్లు, 2019-20లో రూ.9,115 కోట్లు, 2018-19లో రూ.10,745 కోట్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని