Mamata Banerjee: విగ్రహం సరే.. నేతాజీ మిస్టరీ సంగతేంటి?: కేంద్రాన్ని ప్రశ్నించిన దీదీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు.

Updated : 24 Jan 2022 12:14 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఇండియా గేట్‌ వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన కేంద్రం.. అదే మహాత్ముడిపై తమ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని తిరస్కరించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. శకటాన్ని తిరస్కరించడానికి గల కారణాలనూ వెల్లడించలేదని తప్పుబట్టారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో ఆదివారం ఆమె మాట్లాడారు. నేతాజీ శౌర్యాన్ని, పరాక్రమానికి అద్దంపట్టేవిధంగా సృజనాత్మకంగా తీర్చదిద్దిన శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా నేతాజీ అదృశ్యం విషయంలో మిస్టరీ గురించి కేంద్రాన్ని మమత ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయన మిస్టరీని ఛేదిస్తామని చెప్పిన భాజపా.. పూర్తిగా ఆ ప్రమాణాన్ని విస్మరించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఈ విషయంలో ముందడుగు పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేతాజీకి సంబంధించి డాక్యుమెంట్లన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజ్‌ చేశామని చెప్పారు. అమర్‌ జవాన్‌ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్నీ మమత తప్పుబట్టారు. అమర జవాన్‌ జ్యోతిని ఆర్పివేసి.. నేతాజీ విగ్రహాన్ని నెలకొల్పి ఆ తప్పును కప్పిపుచ్చుకోలేరని విమర్శించారు. విగ్రహాలు, స్మారకాలతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

సుభాష్‌ చంద్రబోస్‌, రిషి అరబిందో, వివేకానంద వంటి ఎందరో ప్రముఖుల ఆలోచనల నుంచి ప్రాణం పోసుకున్న సమాఖ్య వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మమత మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని, ఐఏఎస్‌ అధికారులను బెంగాల్‌ నుంచి దిల్లీకి రావాలంటూ సమన్లు జారీ చేస్తున్నారని, గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం సమన్లు పంపారని గుర్తుచేశారు. దేశ చరిత్రను మార్చే, వక్రీకరించే యత్నాలను ప్రతిఘటించాలంటూ పార్టీ పేరును ప్రస్తావించకుండా ఈ సందర్భంగా మమత వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని