Election in Afghan: అఫ్గాన్‌లో ఎన్నికలకు పిలుపునిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు

తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాల్సిన అవసరముందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పేర్కొన్నారు.....

Published : 05 Sep 2021 15:47 IST

తెహ్రాన్‌: తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాల్సిన అవసరముందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పేర్కొన్నారు. తాలిబన్ల చేతిలో అఫ్గాన్ ప్రజల స్థితిగతులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఎన్నికలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. తాలిబన్ల కారణంగా అఫ్గాన్‌లో కొరవడిన శాంతి భద్రతలు ఎన్నికల ద్వారానే మళ్లీ తిరిగివస్తాయని  అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని నిర్ణయించుకునేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రజల అభీష్టం మేరకే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఆయన.. అక్కడి ప్రజల శాంతి భద్రతలకు తమ దేశం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వానికే ఇరాన్ మద్దతు ఉంటుందన్నారు.

అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న అనంతరం.. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగించమని తాలిబన్లు పేర్కొన్నారు. కానీ వాస్తవికంగా అక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మహిళ స్వేచ్ఛను కాలరాస్తున్నారు. కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేశారు. యువతులకు పురుషులు చదువు చెప్పకూడదని తేల్చిచెప్పారు. అనేక మంది మహిళా ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు. తాలిబన్ల ఆగడాలను భరించలేని అనేక మంది మహిళలు వారికి ఎదురుతిరుగుతున్నారు. రోడ్లపైకి చేరి ర్యాలీలు చేపడుతున్నారు. అయితే వీరిపైనా తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలను అడ్డుకుంటూ.. ఎదురుతిరిగిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని