‘పెగాసస్‌’పై ఇజ్రాయెల్‌ దర్యాప్తు

పెగాసెస్‌ స్పైవేర్‌ వ్యవహారం భారత్‌ సహా పలు దేశాలను కుదిపేస్తున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పందించింది. ఆ దేశానికి చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఈ  స్పైవేర్‌ విక్రయించి....

Published : 21 Jul 2021 21:10 IST

దిల్లీ: పెగాసెస్‌ స్పైవేర్‌ వ్యవహారం భారత్‌ సహా పలు దేశాలను కుదిపేస్తున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పందించింది. ఆ దేశానికి చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఈ  స్పైవేర్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇజ్రాయెల్‌ మంత్రుల బృందం ఒకటి దర్యాప్తు జరపనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

ఈ బృందానికి నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నేతృత్వం వహించనుంది. ఎన్‌ఎస్‌వో ఎగుమతులపై ఈ బృందం సమీక్షించనుందని, నేరుగా ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు నేరుగా ఈ బృందం నివేదిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని ఎన్‌ఎస్‌వో అధికార ప్రతినిధి తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాల్లో ఎటువంటి లోపాలూ లేవని పునరుద్ఘాటించారు. ప్రధాని కార్యాలయం మాత్రం దీనిపై స్పందించలేదు.

భారత్‌ సహా 50 దేశాలకు చెందిన వ్యక్తుల పేర్లు పెగాసస్‌ స్పైవేర్‌కు చెందిన లక్షిత జాబితాలో ఉన్నట్లు తేలింది. ఇందులో జర్నలిస్టులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. దీంతో తమకేమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని