S Jaishankar: ‘అది 1962లోనే జరిగింది..’ రాహుల్‌కు జైశంకర్‌ కౌంటర్‌

S Jaishankar: ప్రతిపక్షాల ఆరోపణలను  విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తిప్పికొట్టారు.  భారత భూభాగాన్ని వాస్తవానికి చైనా 1962లోనే ఆక్రమించిందని ఆయన బదులిచ్చారు.

Published : 29 Jan 2023 10:22 IST

పుణె: సరిహద్దుల్లో భారత భూభాగాన్ని చైనా (China) ఆక్రమించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని విదేశాంగ మంత్రి జైశంకర్‌ (S jaishankar) తిప్పికొట్టారు. వాస్తవానికి వారు ఆరోపిస్తున్న భూభాగం 1962లోనే ఆక్రమణకు గురైందని తెలిపారు. పరోక్షంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చైనా (China)తో జరిగిన యుద్ధ సమయంలో ఆ భూభాగాన్ని కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా (China) ఆక్రమించుకుందంటూ ఇటీవల కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సహా పలువురు ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలకు జైశంకర్‌ పై విధంగా బదులిచ్చారు.

అబద్ధమని తెలిసి కూడా..

‘అబద్ధమని తెలిసి కూడా కొన్నిసార్లు వాళ్లు దాన్ని ప్రచారం చేస్తున్నారు. అదేదో ఇప్పుడే జరిగినట్లుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి అది 1962లోనే జరిగింది. దాని గురించి మాట్లాడరు’’ అని పరోక్షంగా చైనా (China)తో ఉద్రిక్తతలను ఉద్దేశించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు జైశంకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. పుణెలో శనివారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల లద్దాఖ్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి భారత్‌లో చైనా (China) ఆక్రమణలను ఉద్దేశించి ఓ నివేదిక రూపొందించారు. తూర్పు లద్దాఖ్‌లో 65లో 26 పెట్రోలింగ్‌ పాయింట్లకు భారత్‌ అనుమతి కోల్పోయిందని దాంట్లో పేర్కొన్నారు. ఈ నివేదికను దిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశంలో ఉంచారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ కూడా హాజరయ్యారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నేనైతే చైనా వాళ్లను కలవను..

2017లో రాహుల్‌ గాంధీ చైనా (China) రాయబారిని కలవడంపైనా జైశంకర్‌ ఈ సందర్భంగా పరోక్షంగా విమర్శించారు. చైనా దురాక్రమణపై ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే తాను చైనా రాయబారుల దగ్గరకు వెళ్లనని పరోక్షంగా రాహుల్‌ చర్యను ఎద్దేవా చేశారు. మన దేశ సైనిక నాయకత్వం దగ్గర సందేహాలను నివృత్తి చేసుకుంటానని వ్యాఖ్యానించారు. చైనా ప్రతినిధులను కలవడంపై అప్పట్లో రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. కీలక అంశాలపై సమాచారం తెలుసుకోవడం నా విధి అని అన్నారు. ఈ క్రమంలోనే చైనా రాబబారి, భూటాన్‌ రాయబారి సహా మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులను కలిశానని చెప్పారు.

దానికి గర్విస్తున్నాను..

భారత్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ‘హిందూ జాతీయవాద ప్రభుత్వం’ అంటూ విదేశీ మీడియా వ్యాఖ్యానించడాన్నీ జైశంకర్‌ ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా, ఐరోపాలోని ప్రభుత్వాలను మాత్రం వారు ‘క్రిస్టియన్‌ జాతీయవాద ప్రభుత్వం’ అని అభివర్ణించరని దుయ్యబట్టారు. అయితే, తమ ప్రభుత్వాన్ని అలా వ్యవహరిస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం, రాజకీయాలు పూర్తిగా జాతీయవాదంతోనే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని