Jal Shakti ministry: జల శక్తి మంత్రిత్వశాఖ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌..!

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విటర్‌ హ్యికింగ్‌కు గురైంది. దిల్లీ ఎయిమ్స్‌ ట్విటర్‌ హ్యాక్‌ అయి పదిరోజులు గడవక ముందే మరో ప్రభుత్వ ఖాతా హ్యాకర్ల ఆధీనంలోకి వెల్లడం ఆందోళనకరంగా మారింది.

Published : 01 Dec 2022 12:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ఖాతా హ్యకింగ్‌కు గురైంది. దిల్లీ ఎయిమ్స్‌ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయి పదిరోజులు గడవక ముందే మరో ప్రభుత్వ ఖాతా హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లడం ఆందోళనకరంగా మారింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు భావిస్తున్నారు. ఈ పేజీలో అనుమానాస్పద ట్వీట్లు కనిపించాయి. ఈ ట్విటర్‌ ఖాతాలో క్రిప్టో రంగంలోని సుయ్‌ వాలేట్‌ అనే సంస్థకు సంబంధించిన పోస్టులు కనిపించాయి. 

జలశక్తి ట్విటర్‌ ఖాతా ప్రొఫైల్‌ ఫొటోగా ఉన్న త్రివర్ణ పతాకాన్ని మార్చేసి సుయ్‌ వాలెట్‌ లోగోను పెట్టారు. ఇక కవర్‌ ఇమేజీ కూడా సుయ్‌ బొమ్మతో ఉంచారు. అంతేకాదు.. ఈ ఖాతాలో చేసిన ట్వీట్లను గుర్తుతెలియని పలు ఖాతాలకు ట్యాగ్‌ చేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఈ ఖాతాను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. సదరు క్రిప్టో సంస్థ ట్వీట్లను తొలగించారు. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

నవంబర్‌ 23వ తేదీన దిల్లీ ఎయిమ్స్‌ కంప్యూటర్‌ సర్వర్లపై రాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. అప్పట్లో సదరు హ్యాకర్‌ రూ.200 కోట్లను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. కానీ, అతడికి ఎటువంటి సొమ్ము చెల్లించలేదు. దిల్లీ పోలీసులు సైబర్‌ టెర్రరిజం కింద కేసు నమోదు చేశారు. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందంతో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.  ఈ హ్యాకింగ్‌తో కనీసం 3 కోట్ల మంది పేషెంట్ల డేటా హ్యాక్‌ అయినట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని