
మహిళా నేతలు చూడాలి కానీ, మాట్లాడకూడదు!
టోక్యో: ఇటీవల ఒలింపిక్స్-2020 కమిటీ అధ్యక్షుడు, జపాన్ మాజీ ప్రధానమంత్రి యోషిరో మోరి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి పదవీచిత్యుడైన విషయం తెలిసిందే. ‘సమావేశాల్లో మహిళలు అతిగా మాట్లాడుతారు.. సమావేశం పూర్తి కావడానికి ఎక్కవ సమయం పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఒలింపిక్స్ కమిటీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ ఘటన మరవక ముందే జపాన్లో సీనియర్ రాజకీయ నాయకుడు మహిళను అవమానించే రీతిలో మాట్లాడారు. మహిళా నేతలు సమావేశాలు ఎలా జరుగుతున్నాయో చూడాలి కానీ.. మాట్లాడకూడదని అన్నారు.
యోషిరో మోరి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో అధికారంలో ఉన్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) మహిళా నేతల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై 12 సభ్యులు ఉన్న కీలక బోర్డు సమావేశాల్లో పార్టీకి సంబంధించిన ఐదుగురు మహిళా నేతలకు చోటు కల్పిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ తోషిహిరో నికై వెల్లడిస్తూ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ‘మహిళలు సమావేశానికి కేవలం చూడటానికే రావాలి. సమావేశంలో నేతలు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో గమనించాలి. అంతేగానీ, ఏమీ మాట్లాడకూడదు. ఒక వేళ తమ అభిప్రాయం చెప్పాలి అనిపిస్తే.. సమావేశం పూర్తయిన తర్వాత సచివాలయంలో రాతపూర్వకంగా అందజేయాలి’ అని తెలిపారు. దీంతో ఎల్డీపీ ప్రతిపాదనపై ప్రతిపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై అధికార పార్టీ వివక్ష చూపుతోందని విమర్శిస్తున్నారు.