విద్యార్థులూ అలర్ట్‌.. త్వరలోనే జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌!

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2023) పరీక్షకు తేదీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్‌.

Updated : 23 Nov 2022 17:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2023) పరీక్షకు తేదీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్‌. వచ్చే వారం లోపే దీనికి సంబందించిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల చేసే అవకాశంలేదని, వచ్చే వారంలో (నవంబర్‌ 30నాటికి) పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, జేఈఈ మెయిన్‌ 2023 తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఈనెల 30లోగా నోటిఫికేషన్‌ వస్తే తొలి విడత పరీక్షకు వెనువెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మొదలుకానుంది. అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్‌ నోట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన నేపథ్యంలో అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తొలి సెషన్‌ ఏప్రిల్‌లో పెట్టాలంటూ పలువురి విజ్ఞప్తి

మరోవైపు, జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జనవరిలో జరుగుతుందన్న వార్తలపై పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జనవరిలో నిర్వహించొద్దంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్‌టీఏ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  తొలి విడత జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. జనవరి-ఫిబ్రవరిలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం కుదరదని పేర్కొంటున్నారు. అలాగే, 12వ తరగతి సిలబస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ #Jeemainsinapril పేరిట హ్యాష్‌టాగ్‌తో ట్విటర్‌ వేదికగా కోరుతున్నారు. దీంతో పాటు ఈ ఏడాది అనేక బోర్డులు బోర్డు పరీక్ష ప్రాక్టికల్స్‌ కూడా జనవరిలోనే ప్రారంభిస్తున్నాయి. గతేడాది తొలి విడత జూన్‌ 20- 29 తేదీల మధ్య జరగ్గా.. రెండో సెషన్‌ పరీక్షను జులై 21- 30 తేదీల మధ్య నిర్వహించారు. ఈ రెండు విడతలకు 10.26లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 9,05,590 మంది పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. 

దేశంలోని ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (BE/Btech/BArch,etc) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో టాప్‌ స్కోర్‌ సాధించిన 2.5లక్షల మంది విద్యార్థులకు ప్రఖ్యాత సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని